వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నారని ఊహాగానాలు విన్పించాయి . ఈ నెల 17 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపడుతారన్న ప్రచారమైతే జోరుగా జరిగింది . అయితే అంతలోనే ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని అనుకోవడం లేదన్న వార్తలు వెలువడ్డాయి . చంద్రబాబు ... ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త యాత్ర చేయడం వల్ల పెద్ద ప్రయోజనమేమి ఉండదన్న వాదనలు టీడీపీ వర్గాల్లోనే విన్పిస్తున్నాయి .
ఎన్నికలు జరిగి ఏడాది కూడా గడవకముందే ప్రజల్లోకి వెళ్లడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని , అందుకే చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ను విరమించుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు . వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్నెల్ల వరకు తొలుత వేచిచూసే ధోరణితో వ్యవహరించాలని టీడీపీ నాయకత్వం భావించింది . కానీ జగన్ సర్కార్ తీసుకున్నదూకుడు నిర్ణయాలతో , టీడీపీ నాయకత్వం చేసేది ఏమి లేక ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ వస్తోంది .
అధికార పార్టీ తీసుకున్న పలు విధానపరమైన నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది . మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా , రాజధాని ప్రాంత రైతులు చేస్తోన్న దీక్షలకు మద్దతునిస్తోంది . రాజధాని జాక్ నేతలు చేపట్టిన కార్యక్రమాల్లో చంద్రబాబు జోలెపట్టి , రాజధాని కోసం విరాళాలను కూడా సేకరించారు . ఏదోవిధంగా ప్రతినిత్యం ప్రజల్లోనే ఉంటున్న తాము ఇంకా ప్రత్యేకంగా బస్సు యాత్ర చేపట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్న ను తమ్ముళ్లు లేవనెత్తుతున్నారు .
దీనితో తొలుత బస్సు యాత్ర చేయాలనుకున్న బాబు , చివరకు తమ్ముళ్ల అభిప్రాయానికి విలువనిచ్చి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది . ఏ నియోజకవర్గ నేతలు ఆ నియోజకవర్గం లో క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలని అధినేతకు విన్నవించాలని నిర్ణయించినట్లు సమాచారం .