చంద్రబాబు గ్రాఫిక్స్ బొమ్మలతో అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేస్తే.. జగన్ మాత్రం చేసేదే చెబుతూ నిజాయితీగా పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించారని, అమరావతిలో మోసపోయింది దళితులేనని.. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. దళితుల అసైన్డ్‌ భూములు టీడీపీ నేతలు లాక్కున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.



దళితుల భూములను సీఎం వైయస్‌ జగన్‌ మళ్లీ వెనక్కి ఇచ్చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పంటలు పండే భూములను చంద్రబాబు స్వార్థం కోసం లాక్కొని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను, రైతు కూలీలను సీఎం ఆదుకున్నారని, కౌలు ఒప్పందాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు, రైతు కూలీలకు పింఛన్‌ రూ.2,500 నుంచి రూ. 5 వేలకు పెంచారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.



రూ. లక్ష కోట్లు పెట్టి ఒకే చోట అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటీ..? అని చంద్రబాబును సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తన మీడియా బలంతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నాడని, టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. వికేంద్రీకరణ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.



సంక్షేమ కార్యక్రమాలే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని మండిపడ్డారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం వైయస్‌ జగన్‌ గాడిలో పెడుతున్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు వైయస్‌ జగన్‌ అని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: