జేడీ లక్ష్మీనారాయణ...తన ఉద్యోగాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న సీబీఐ మాజీ అధికారి. అధికారిగా తన జర్నీ పూర్తి చేస్తున్న తరుణంలో తన రాజకీయ ప్రయాణంపై అనేక ట్విస్టులు ఇచ్చారు. పొలిటికల్ జర్నీలో కూడా ఆయన అనేక ఆసక్తులు కల్పించారు. చివరకు, జనసేనలో చేరి ఇటీవలే ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. అయితే, తాజాగా ఆయనకు బీజేపీ షాక్ ఇచ్చిందంటున్నారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో పార్టీ ప్రకటించబోతున్నారంటూ జేడీ ప్రచారంలో నిలిచారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ, పార్టీ విషయాలు అనౌన్స్ చేయటానికి మరికొంత సమయం కావాలంటూ చెప్పుకొచ్చారు. పార్టీ పేర్లపై వచ్చిన ప్రచారంపై నోరు విప్పని ఆయన.. అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందింది అని చెప్పుకొచ్చారు. అనంతరం లక్ష్మీనారాయణ టీడీపీతో చర్చలు జరిపి జనసేనలో చేరారు! ఆయనకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ అధినేత పవన్ అవకాశం కల్పించగా ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం అంత క్రియాశీలంగా పార్టీలో పనిచేయలేదు. అనంతరం రాయలసీమలో పార్టీని బలోపేతం చేయాలని భావించిన పవన్ కళ్యాణ్...ముఖ్యమంత్రి ఇలాకా కాబట్టి సమర్థుడైన వ్యక్తిని అందుకు ఎంచుకోవాలని...లక్ష్మీనారాయణకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే, ఆ బాధ్యతలపై కూడా లక్ష్మీనారాయణ అంతగా దృష్టి సారించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఆ తర్వాత..జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్బై చెప్పేశారు. ఇప్పుడు బీజేపీ వైపు దృష్టి సారించినట్లు సమాచారం.
జాతీయ పార్టీ అయిన బీజేపీ ఆయన వైపు చూస్తోందని, ఇందుకోసం ఓ ముఖ్యనేత మంతనాలు జరుపుతున్నారని టాక్ వినిపించింది. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని, మరోవైపు రాష్ట్రంలో జనసేన రోజురోజుకూ బలహీన పడుతోందని, ముఖ్యనేతలు సైతం పవన్ కళ్యాణ్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని...బీజేపీ నేతలు జేడీ లక్ష్మీనారాయణకు మధ్య చర్చ జరిగిందని సమాచారం. అయితే, తాజాగా వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలతో భారీ విజయం సాధించి, మరోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టించింది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలిచి, రాజధాని రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని ఆరాటపడిన బీజేపీ.. మరోసారి భంగపడింది. పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమవడంతో బీజేపీ ఆందోళనలో పడింది. దీంతో... లక్ష్మీనారాయణ పొలిటికల్ జర్నీ డైలమాలో పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.