మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై హైకోర్టులో ఈ రోజు మరోసారి ధర్మాసనం వాదనలు విననుంది. గతవారం ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను వైఎస్ జగన్ వెనక్కు తీసుకున్నారు. జగన్ తరపు లాయర్ ఈ పిటిషన్‌పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై లిఖితపూర్వకంగా మెమో దాఖలు చేయాలని కోర్టు లాయర్‌కు సూచించింది. ఇందుకు సంబంధించిన విచారణ ఈ రోజు జగనుంది.

 

2019 ఎన్నికలకు ముందు జగన్ బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లోనే  రక్తపు మడుగు లో పడి ఉన్న వివేకానందరెడ్డి మరణం అప్పట్లో దుమారం రేపింది. ముందుగా ఆయన గుండెపోటుతో మరణించి ఉంటారని చెప్పినా తరువాత ఆయనది హత్యగా తేల్చారు. అయితే హత్యా జరిగి ఇన్నాళ్లు గడుస్తున్నా ఇంతవరకు అందుకు కారకులను మాత్రం పట్టుకోలేకపోయారు.

 

ఈ కేసు దర్యాప్తు ను సీబీఐకి అప్పగించేలా చూడాలని అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత ఈ హత్య పై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.. టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.

 

ఇదిలా ఉంటే వివేకా హత్యకేసుపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కూడా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే సీబీఐకి అప్పగించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: