తరుచూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేసే టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఈసారి డోస్ పెంచారు. శుక్రవారం పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికార వైసీపీని లక్ష్యంగా చేసుకుని ఆమె దుమ్మెత్తిపోశారు. ప్రధానంగా సిఎం జగన్ ని లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. 

ఇటీవల సుప్రీం కోర్ట్ క్రిమినల్ రాజకీయ నాయకుల పేర్లను ప్రకటించాలని ఆదేశించిన నేపధ్యంలో ఆమె స్పందిస్తూ, క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్దమా? టైం, ప్లేస్ మీరు చెబుతారా? మమ్మల్ని చెప్పమంటారా? అంటూ బహిరంగ సవాల్ చేసారు. రాష్ట్రం మొత్తం మీద 2,75,117 వేల ఎకరాలను జగన్ స్వాహా చేసి 16,97,335 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని ఆరోపించారు.

 

8 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని దుమ్మెత్తిపోశారు.  43వేల కోట్లు మీ ఆస్తులు జప్తు చేశారన్నారు. అత్యున్నత న్యాయస్థానాలు సైతం జగన్ చేసిన అక్రమార్జన చూసి ఆశ్చర్యపోయాయన్నారు అనురాధ. జగన్ లాంటి అవినీతి పరుడుని ఎక్కువ కాలం భయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సాక్షాత్తు సీబీఐ కోర్టు వ్యాఖ్యానించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. 87% వైకాపా నేతల్లో క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు. 

 

మీ మీద అవినీతి కేసులన్నాయని మా మీద కూడ అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం వైకాపా చేస్తోందని మండిపడ్డారు. ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా నాయకులు డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆమె, వాటికి మాకు ఏం సంబంధం ఉంది? అని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 

 

38 వారాల నుంచి జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా కుంటి సాకులు చెబుతన్నారన్నారు. ఈ రోజు కూడా జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టు చకర్లు కొడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై 26 ఎంక్వైరీలు వేసి ఏం చేయలేకపోయారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ఆస్తులను క్రమం తప్పకుండా ప్రతి యేడాది ప్రకటిస్తున్నారని, జగన్ కు దమ్ముంటే  ఆస్తులను ప్రకటించాలని ఆమె బహిరంగ సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: