టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు త్వరలోనే ఏపీలో ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుత జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు సంధించడంతోపాటు.. ప్రజలు గత ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించలేక పోవడం వల్లే ఇప్పుడు అరాచకానికి గురవుతున్నారంటూ .. ప్రజలకు క్లాస్ ఇచ్చే పనిని ఆయన ప్రారంభించనున్నారు. అదే సమయంలో స్థానికంగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కూడా బాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఇంత వరకు బాగానే ఉన్న ప్పటికీ.. సీనియర్లు మాత్రం ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు రోడ్లమీదకి రావడం సరికాదని అంటున్నారు. పార్టీని పటిష్టం చేసుకోవాల్సి ఉన్నప్పటికీ.. త్వరలోనే జరగనున్న స్తానిక ఎన్నికలను అడ్డు పెట్టుకుని బాబు వంటి సీనియర్ నాయకుడు వీధుల్లోకి వస్తే.. ప్రజలు పెద్దగా హర్షించరని కూడా చెబుతున్నారు.
ఈ క్రమంలోనే పార్టీకి సెకండ్ నేతగా ఎదుగుతున్న చిన్నబాబు మాజీ మంత్రి లోకేష్ను రంగంలోకి దింపడం ఇది సరైన సమయమని కూడా వారు సూచిస్తున్నారు. స్థానికంగా లోకేష్ తన సత్తాను నిరూపించుకునేం దుకు కూడా ఇది ఒక చక్కని అవకాశంగా ఉంటుందని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో లోకేష్ ప్రజలకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో తాను పైన ఉండి.. పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు.. లోకేష్కు దిశానిర్దేశం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
లోకేష్ను కార్యరంగంలోకి దింపడం వల్ల తమ్ముళ్ల మధ్య విభేదా లను తగ్గిస్తూనే.. పార్టీకి రెండో నాయకత్వాన్ని కూడా పరిచయం చేసినట్టు అవుతుందని.. తద్వారా ఇప్పటి వరకు పార్టీలో ఉన్న శూన్యత కూడా కరిగిపోతుందని అంటున్నారు. కానీ, చంద్రబాబు వ్యూహం మాత్రం ఆవిధంగా కనిపించడం లేదు. ఆయనే ప్రజా చైతన్య యాత్ర చేస్తే.. పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నారు. కానీ, ఇది వృధా ప్రయాసగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.