ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో జాతీయ రాజకీయ వర్గాల్లోనూ... ఏపీ రాజకీయాల్లో వర్గాల్లోనూ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగుతోంది. నిన్నటికి నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గంట పాటు సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆగమేఘాలమీద ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో గత రెండు రోజులుగా వైసిపి ఎన్డీయేలో చేరుతుందని... ఆ పార్టీకి రెండు క్యాబినెట్ మంత్రి పదవులు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లేదా మరో ఎంపీకి మంత్రి పదవి ఖాయమనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రెండు మంత్రి పదవులు రెడ్డి కోటాలో విజయసాయి రెడ్డికి మంత్రి పదవి వస్తే... ఎస్టీ కోటాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్నదానిపైనే కాస్త సస్పెన్స్ ఉంది. ఇదిలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు వైసీపీ ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధంగా ఉందన్న సంకేతాలకు దగ్గరగా ఉన్నాయి.
కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీనికోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఎందుకు గొడవ పడాలని కూడా మీడియాను ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీతో తాము దగ్గరగా.. దూరంగా లేమని ఛలోక్తి ధోరణిలో మాట్లాడారు.
ఇదిలా ఉంటే ఇదే విషయమై వైసీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. కేంద్ర కేబినెట్లో చేరాలని వైసీపీని.. బీజేపీ ఆహ్వానించిందని.. ఆ మేరకు ఆమోదం తెలియచేయడానికే.. జగన్ ఢిల్లీ పర్యటనలకు వెళ్లారని చెబుతున్నారు. ఏదేమైనా దీనిపై ఒకటి రెండు రోజుల్లోనూ పూర్తిగా క్లారిటీ రానుంది.