గత కొద్దికాలంగా ఆరోగ్యంపై అన్ని వర్గాల్లో శ్రద్ధ పెరుగడం... రోగాల బారిన పడకుండా ఉండేందుకు పండ్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరగడం తెలిసిన సంగతే. పైగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో నివసిస్తూ.. కాలుష్యం బారిన పడటం, గందరగోళం జీవితం, రసాయనిక ఎరువుల ఆహారం తీసుకుంటున్న వారు పండ్లను కొనుగోలు చేస్తున్న దోరణి పెరుగుతోంది. అయితే, హైదరాబాద్ వాసులకు ఈ విషయంలో ఓ షాకింగ్ న్యూస్. నగరంలో కీలకమైన స్థానంలో ఉన్న ఓ పండ్ల మార్కెట్ తరలిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అతి పెద్దదైన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను కోహెడకు తరలించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో జాంబాగ్లోని పండ్ల మార్కెట్ను ఆనాటి రద్దీ పరిస్థితుల నేపథ్యంలో నగర శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేటలో (1986లో) 22 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో పండ్ల మార్కెట్ కొనసాగింది. ఈ మార్కెట్లో పాత 97 దుకాణాలు (ఏ క్లాసు 36, బీ క్లాసు 24, సీ క్లాసు 37) ఉండగా.. డీ క్లాసులో మరో 41 షాపులు నిర్మించారు. పెరిగిన ఉత్పత్తి, రవాణా, ఎగుమతి కారణంగా మార్కెట్ యార్డు వెనుకభాగంలోని బిడ్డింగ్ యార్డులపైన మరో 75 దుకాణాలు నిర్మించారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ మార్కెట్ 2006లో ప్రత్యేక మార్కెట్ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్గా ఏర్పడింది.
అయితే, నగరాభివృద్ధిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించడంతో శివారు ప్రాంతంగా ఉన్న కొత్తపేట నగరం నడిమధ్యలో ఉన్నట్లుగా రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో మార్కెట్కు ప్రతి వేసవి మామిడి సీజన్లో ప్రతి రోజూ 800 నుంచి 1000 వరకు భారీ, చిన్న లారీలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారితో పాటు సర్వీసు రోడ్డు, కాలనీ రహదారులన్నీ పండ్లతో వచ్చే భారీ వాహనాల పార్కింగ్తో నిండిపోతున్నాయి. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో స్థానికులకు ఇక్కట్లు పెరిగాయి. దీంతో మార్కెట్ తరలింపు అనివార్యం అయింది. ఈ క్రమంలోనే... కోహెడలో 178.09 ఎకరాల్లో సరికొత్త మార్కెట్కు శ్రీకారం చుట్టింది. సర్వే నం.507లో 59.83 ఎకరాలు, 548లో 118.26 ఎకరాల భూ సేకరణ చేశారు. ఈ మొత్తం భూమిని మార్కెట్ నిర్మాణానికి కేటాయించారు. తాజాగా ఉత్తర్వుల ద్వారా కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా పండ్ల వ్యాపారం మరింతగా పెరుగనున్నది. దీంతో పాటే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. అయితే, నగరంలోని పండ్ల వ్యాపారులకు మాత్రం ఇది షాకింగ్ పరిణామమని అంటున్నారు.