పోలవరం ప్రాజెక్టులో ఊహించని రీతిలో భారీ అవినీతి జరిగిందని మరోమారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.... రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతున్నట్లు కొన్ని పచ్చ పత్రికలు కట్టు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. రూ.2వేల కోట్ల అక్రమ లావాదేవీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కోసమే ఇటువంటి కథనాలు అని ఆరోపించారు.
రాజధానికి భూములు ఇవ్వడానికి ముందే ఉండవల్లి,తాడేపల్లిలో భూములకు మూడు నుంచి నాలుగు కోట్ల ధర ఉందని పార్థసారథి తెలిపారు. రాజధానికి భూములు ఇవ్వలేదని మంగళరిగి పరిధి గ్రామాల్లో ధరలు పడిపోయేలా చంద్రబాబు చేశారని ఆయన ఆరోపించారు. రాజధానికి భూములు ఇవ్వలేదని జోన్ పేరుతో ధరలు లేకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ధరలు పడిపోవడానికి చంద్రబాబే కారణమని పార్థసారథి ఆరోపించారు. సబ్ కాంట్రాక్టుల ద్వారా దక్కే పేమెంట్ కోసమే ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం నిర్వహించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ప్రాజెక్టును పూర్తి చేయడంపై శ్రద్ధ ఉండి ఉంటే... పనుల్లో తీవ్రమైన జాప్యం ఎంది జరిగిందని ఆయన ప్రశ్నించారు.
రాజధాని అభివృద్ధి గురించి ఎప్పుడూ చంద్రబాబు ఆలోచించలేదని పార్థసారథి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేసేందుకే చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ విధానంతో రైతులకు అన్యాయం చేసి తన వర్గానికి చంద్రబాబు మేలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని పార్థసారథి తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయం రంగం కుదేలయిందని పేర్కొన్న పార్థసారథి దాన్ని చక్కదిద్దేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.