ఏటీఎం లావాదేవీలు మరింత ఖరీదు కానున్నాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలపై ఉచిత లావాదేవీలు పరిమితం చేయాలని, ట్రాన్సాక్షన్ ఛార్జీలు కూడా పెంచాలని ఏటీఎం ఆపరేటర్ల సంఘం రిజర్వ్ బ్యాంకును కోరింది. ఆర్బీఐ కూడా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏటీఎం ఛార్జీలు పెరగక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. 

 

ఇకపై ఏటీఎంలలో నగదు విత్‌ డ్రా, బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.  ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంక్‌ కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

 

ప్రస్తుతం ఒక బ్యాంక్‌ కార్డును వేరే బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలో వినియోగించినప్పుడు సదరు ఏటీఎం ఆపరేటర్‌కు ఖాతాదారుడు ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు చెల్లించాలి. కస్టమర్లకు ఐదు ట్రాన్సాక్షన్లను ఉచితంగా అందిస్తూ ఆ పైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు లావాదేవీలపై 15 రూపాయలు, నగదు రహిత లావాదేవీలకు 5 రూపాయల చొప్పున ఛార్జీలు ఉన్నాయి. 

 

అయితే ఈ ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని కోరుతూ ఏటీఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్‌బీఐకి ఓ లేఖ రాసింది. ఏటీఎం భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్‌బీఐ పెంచిన తరుణంలో.. ఏటీఎంల నిర్వహణ ఖర్చు పెరిగిందని.. దీని వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆపరేటర్లు లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల కొత్త ఏటీఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నామని చెప్పారు. 

 

దేశంలో ఏటీఎంల వినియోగం, వ్యాప్తిని పెంచేందుకు ప్రతిపాదనల కోసం గతేడాది ఆర్‌బీఐ ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత డిసెంబరులో తమ ప్రతిపాదనలను రిజర్వ్‌ బ్యాంక్‌కు సమర్పించింది. అందులో ప్రధానంగా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులను పెంచాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును 17 రూపాయలకు, నగదు రహిత లావాదేవీలకు 7 రూపాయలకు పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది.  ఉచిత ట్రాన్సాక్షన్లను కూడా మూడుకు పరిమితం చేయాలని సూచించింది. ఇక గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో నగదు లావాదేవీలకు 18 రూపాయలు, నగదు రహిత లావాదేవీలకు 8 రూపాయలు వసూలు చేయాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. ఉచిత ట్రాన్సాక్షన్లు ఆరుకు పెంచాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది.  దీనిపై ఆర్‌బీఐ ఏటీఎం ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: