బీజేపీ , జనసేనల మధ్య మైత్రికి నూకలు చెల్లినట్లేనా ?, పవన్ ఆట లో అరటి పండు అయ్యారా ?? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం విన్పిస్తోంది . ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షం లో ఆ పార్టీతో మైత్రి ఓకే చెప్పిన పవన్ , రాష్ట్ర కమలనాథులతో కలిసి ముందుకు నడవాలని నిర్ణయించుకున్నారు . ఈ మేరకు రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలను చేపట్టాలని భావించారు .
ఇదే విషయాన్ని జనసేనాని పవన్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు సంయుక్తంగా ప్రకటించారు . స్థానిక సంస్థల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తరువాత ,ఈ నెల రెండవ తేదీన రాజధాని రైతులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించాలని భావించారు . అయితే అంతలోనే ఏమి జరిగిందో ఏమో కానీ లాంగ్ మార్చ్ కార్యక్రమం రద్దయింది . దీనితో పవన్ బాగా అసంతృప్తి కి గురయినట్లు తెలుస్తోంది .
బీజేపీ ప్రమేయం లేకుండానే , ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ ఆసక్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది . నిన్న కర్నూల్ , నేడు రాజధాని ప్రాంతం లో పవన్ నిర్వహించిన కార్యక్రమాల్లో బీజేపీ ఊసన్నదే లేకుండా పోయింది . దానికితోడు ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా అసలు బీజేపీ , జనసేన మధ్య మైత్రి కొనసాగుతోందా? లేదా ?? అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది .
ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో భేటీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం , వైస్సార్ కాంగ్రెస్ పార్టీని మోదీ, కేంద్ర కేబినెట్ లోకి ఆహ్వానించారన్న ఊహాగానాల నేపధ్యం లో బీజేపీ , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ల మధ్య కొత్తగా రాజకీయ స్నేహం చిగురించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఈ నేపధ్యం లో పవన్ తో బీజేపీ పొత్తు కొనసాగిస్తుందా ? లేదా ?? అన్న అనుమానాలు నెలకొన్నాయి .