తిరుపతికి చెందిన  తొలితరం నాయకులు, విద్యావేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మాజీ స్పీకర్‌ డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి(87) ఆదివారం మృతి చెందారు. ఈయన తిరుపతి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎన్నికవడమే కాకుండా, డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఇకపోతే ఈశ్వర రెడ్డి గారు గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం 02.30 గంటలకు తుది శ్వాస విడిచారు.

 

 

రేణిగుంట సమీపంలోని తూకివాకం ఈయన స్వగ్రామం. రెడ్ది గారికి ఇద్దరు పిల్లలు, అందులో కుమారుడు తిరుపతిలోనే స్థిరపడగా, కుమార్తె చెన్నైలో వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.. ఇక చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో, 1933 డిసెంబర్ 28న, జన్మించారు. ఈశ్వర రెడ్డి  మద్రాస్‌ రెసిడెన్సీ కళాశాలనుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. మద్రాస్‌ లా కళాశాల నుంచి బీఎల్‌ డిగ్రీ పొందారు. అలాగే రాంచీ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు.

 

 

ఇకపోతే 1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయన.. తిరుపతి నుండి పోటీ చేసి 1967, 1978లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు చేతిలో ఓటమి పొందాక, రాజకీయాలకు దూరంగా ఉండటమే కాకుండా, తిరుపతి, రేణిగుంటలలో విద్యా సంస్థలు స్థాపించి విద్యాదానం చేస్తున్నారు.

 

 

ఇక ఈశ్వర రెడ్డి గారి భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం తిరుపతిలోని గోవింతదామంలో అంత్యక్రియలు జరపనున్నారు. ఈయన మరణ వార్త తెలిసిన పలువురు నాయకులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సంతాపంతో పాటుగా, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: