తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వినూత్నంగా కార్యచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఇప్పటికే #eachoneplantone (ప్రతీ ఒక్కరూ ఒక మొక్కనాటండి) అని పిలుపు ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ సన్నిహితుడు, ఆయన బంధువైన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇంకో పిలుపు ఇచ్చారు. #SelfieWithSaplingOnBbirthdayOfLegend పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తనకు వరుసకు సోదరుడైన మంత్రి కేటీఆర్ పిలుపునకు కొనసాగింపుగా ప్రతి ఒక్కరూ సీఎం కేసిఆర్ పేరుతో మొక్కను నాటుదామని పార్టీ శ్రేణులకు ఎంపీ సంతోష్ పిలుపునిచ్చారు. ‘‘రేపటి తరానికి మనం కూడబెట్టాల్సింది ధన సంపద మాత్రమే కాదు...వన సంపద ’’ అనే సీఎం కేసీఆర్ ఆలోచనావిధానాన్ని మనం అనుసరించాల్సిన సమయం వచ్చిందని అందుకే మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు.`` సీఎం కేసీఆర్ మనందరిలో స్పూర్తిని నింపాలన్న సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో నేను ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మీరంతా ఆదరిస్తుండడం చాలా ఆనందకరమైన విషయం. పచ్చని మొక్కను పసిపాపలా సాదుకుంటున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మొక్కలు నాటుతున్న ప్రతీ ఒక్కరూ ‘సెల్ఫీ విత్ సాప్లింగ్’ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొనాలి` అని ఎంపీ సంతోష్ కుమార్ కోరారు.
``ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు ఫిబ్రవరి 17న అని మనకందరికీ తెలిసిందే. మొక్కలను నాటడం, వాటిని పెంచటం అనేది సిఎం కెసిఆర్ కు చాలా ఇష్టమైన సేవాకార్యక్రమం. కాబట్టి అందరూ ఫిబ్రవరి 17 తేదీన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘సెల్ఫీ విత్ సీఎం సర్ సాప్లింగ్’అనే నినాదం స్ఫూర్తితో మొక్కలు నాటి, సెల్ఫీ దిగి.. వాట్సాప్ చేయండి`` అని కోరారు. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆప్తుడు ఇచ్చిన ఈ పిలుపునకు పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూద్దాం.