ఒక్క బాధ్యత గల వ్యక్తిగా పని చేయాల్సిన ఆఫీసర్ అన్యాయాలకు పాల్పడాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ చీకటి వ్యవహారం వెలుగుచూసింది. ఓ కేసులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.5లక్షలు గుంజాడు. ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి ఆ బాధిత యువతి షాక్ తిన్నది. 

 

కొన్నేళ్ల క్రితం ఓ ఫిర్యాదు నిమిత్తం ఓ మహిళ మాదాపూర్‌ జోన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. స్టేషన్‌లో ఉన్న ఎస్ఐతో మాట్లాడి వివరాలు వెల్లడించింది. ఈ క్రమంలో కేసు వివరాలను అప్‌డేట్ చేసేందుకని ఎస్ఐ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అలా కేసు నిమిత్తం తరుచూ ఆమెకు ఫోన్ చేసేవాడు. ఆ క్రమంలో కొన్నిసార్లు ఆమె ఇంటికి కూడా వెళ్తుండేవాడు.

 

ఎస్ఐ నిజంగానే కేసుపై సీరియస్‌గా దర్యాప్తు జరుపుతున్నారని ఆమె నమ్మింది. ఈ క్రమంలో అతను తరుచూ చేస్తూ ఫోన్ మాట్లాడటంతో.. అతని మాయలో పడిపోయింది. అది కాస్త ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో శారీరకంగానూ ఇద్దరు దగ్గరయ్యారు. అదే సమయంలో అతనికి రూ.5లక్షల వరకు ఇచ్చింది.


అయితే తరుచూ తన ఇంటికి వచ్చి వెళ్లే ఆ ఎస్ఐ.. తన తల్లితోనూ వివాహేత సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు ఆలస్యంగా తెలిసింది. దీనిపై అతన్ని నిలదీయగా తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. పలు పోలీస్ స్టేషన్లలో అతనిపై ఫిర్యాదు చేసినా.. తనకున్న పలుకుబడితో ఎక్కడా కేసు ఫైల్ కాకుండా అడ్డుపడ్డాడు. 

 

తాజాగా ఆ బాధితురాలు సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులను కలిసి తన గోడు వెల్లబోసుకున్నారు. ఎక్కడ ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు కాకుండా అడ్డుకుంటున్నాడని చెప్పారు. దీంతో ఆ ఎస్ఐపై కేసు నమోదు చేయాల్సిందిగా వారు ఆదేశించారు. శాఖాపరమైన చర్యలకు కూడా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నిందితుడు విధులకు కూడా రావట్లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: