కర్ణాటక రాష్ట్రంలో సాంప్రదాయంగా ప్రతి ఏటా కంబళ పోటీలు నిర్వహిస్తారు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ కంబళ పోటీలలో మట్టిలో మాణిక్యం లాగా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రస్తుతం తెరమీదికి వస్తున్నారు. ఈ కంబళ పోటీలలో శ్రీనివాస్ గౌడ అనే యువకుడు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పరిగెత్తి సంచలనం సృష్టించాడు. ప్రపంచ రన్నింగ్ ఛాంపియన్ అయిన హుస్సేన్ బోల్ట్ రికార్డు 9.58 సెకన్లు రికార్డును యువకుడు బ్రేక్ చేశాడు. దీంతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు శ్రీనివాస గౌడ . దేశం దృష్టిని మొత్తం ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. శ్రీనివాస్ గౌడ మట్టిలో మాణిక్యం అంటూ ఎంతో మంది ప్రశంసలు సైతం కల్పించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం సైతం ఇతనికి శిక్షణ ఇప్పించి అతనిలోని ప్రతిభను వెలికి తీస్తాము అంటూ తెలిపింది. అంతే కాకుండా అతనికి భారీ నజరానాలు కూడా ప్రకటించారు. ఇక భారత ప్రజలందరూ ఇండియన్ హుస్సేన్ బోల్ట్ అంటూ అతన్ని ప్రశంసించడం మొదలుపెట్టారు. నీటిలో పరిగెడుతున్న ఎద్దులను తరుముతూ వాటి వెంట పరిగెట్టాడు శ్రీనివాస్ గౌడ. ఇక ప్రస్తుతం ఎవరి నోట చూసినా శ్రీనివాస్ గౌడ మాట వినిపిస్తోంది. ఇంతటి గొప్ప ప్రతిభావంతులు ఇండియాలో ఉండడం అదృష్టం అని అందరూ భావిస్తున్నారు. ఇంతకు మించిన అద్భుతం మరొకటి ఉండదు అనుకుంటున్న తరుణంలో... అంతకు మించిన అద్భుతమే తాజాగా జరిగింది.
కంబల టోర్నీలో భాగంగా తాజాగా జరిగిన టోర్నీలో శ్రీనివాస్ గౌడ్ రికార్డు బద్దలైంది. నిశాంత్ శెట్టి అనే యువకుడు చిరుతను తలపించేలా పరుగులు తీస్తూ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలోనే అధిగమించాడు. దీంతో శ్రీనివాస్ గౌడ 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తిన రికార్డును బద్దలు కొట్టాడు నిశాంత్ శెట్టి. దీంతో ప్రపంచం చూపు మొత్తం ఒక్కసారిగా అతని వైపు మళ్ళింది. శ్రీనివాస్ గౌడ రికార్డు అద్భుతం అనుకుంటున్నా అందరికీ ఇది అంతకు మించిన మహా అద్భుతం అని అనుకుంటున్నారు. కాగా నిశాంత్ శెట్టి కర్ణాటకలోని భజాగోలి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు. ఈ పోటీలో నిశాంత్ శెట్టి మొత్తం నూట నలభై మూడు మీటర్ల దూరాన్ని 13.68 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.