తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విభిన్న రాజకీయవేత్త అనే సంగతి తెలిసిందే. రాజకీయంలోనే కాకుండా పరిపాలనలో కూడా తన పంథాను ఆయన కొనసాగిస్తుంటారు. ఇందుకు తొలి విడత సర్కారు చేపట్టినప్పటికీ....మలి విడత సర్కారులో కూడా ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే, దీనికి కొనసాగింపుగా తాజాగా మరోమారు ఆసక్తికర ప్రకటన చేశారు కేసీఆర్. ఇటీవలే ఎన్నికలైన యర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన పట్టణ ప్రగతి కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం పట్టణప్రగతి గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్లర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లకు కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. వారికి పట్టణప్రగతి నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం కర్తవ్య బోధ చేశారు.
`ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీ చేతుల్లోనే ఉంది. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదన్నారు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని చూపించొద్దు` అని అన్నారు. ``నా వరకు అయితే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు రెండు సార్లు సీఎం చేశారు. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారావ్రతం (కత్తి మీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంత సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దు. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం` అని అన్నారు.