తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని మంత్రివర్గం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో మతపరమైన వివక్ష చూపరాదని తెలంగాణ మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాకుండా దీనికి వ్యతిరేకంగా తాము తీర్మానం చేయనున్నట్లు వెల్లడించింది. అయితే, ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తూ.. సీఎం కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని సూచించింది. భారతరాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేసేలా పరిణమించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇందుకు సంబంధించిన తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
దీనిపై ఎంఐఎం పార్టీ అధినేత స్పందిస్తూ...చారిత్రాత్మకమైనదని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కే చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ సవరణను రద్దుచేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం స్వాగతించదగిన పరిణామమని చెప్పారు. కేరళలో మాదిరిగా ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేసేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ జామియా మిలియా వర్సిటీలో విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జి జరిపిన పోలీసులపై కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్రమంగా వర్సిటీలోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థులతో దౌర్జన్యంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. బయటకు వెళ్తామని విద్యార్థినులు బతిమిలాడినా లాఠీలతో కొట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు.