ఇటీవల తరచూ ఏదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలతో చంద్రబాబు, టీడీపీని ముప్పుతిప్పులు పెడుతోన్న విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కాంట్రవర్సీ వ్యాఖ్యలతో ఈ సారి చంద్రబాబునే ఇరకాటంలో పడేశారు. తాజాగా నాని మోడీ, అమిత్ షాను టార్గెట్ చేస్తూ బాబును ఇరకాటంలో పడేశారు. దేశంలో ఇప్పుడు మరో స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి నేడు ఏర్పడిందని... తాను సూటిగా అమిత్ షా, మోడీ ని ప్రశ్నిస్తున్నానని...దేశాన్ని కుల మత ప్రాంతాల వారిగా విభజించే హక్కు ఎవరు ఇచ్చారు మీకు ? అన్నారు. ఇక మీ రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రజల మధ్య ఐక్యత దెబ్బతీయడంతో పాటు మీ ఓట్లు కోసం మీరు ఆడుతోన్న రాజకీయ ఆట దేశానికే ప్రమాదంగా మారిందన్నారు.
ఆనాడు షేక్ అబ్దుల్లా లేకపోతే నేడు కశ్మీర్ పాకిస్థాన్ లో ఉండేది.. అలాగే నాడు ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఆర్టికల్ 370ని తీసుకువచ్చారు... దేశంలో పార్లమెంటేరియన్ అంటే ఎలా ఉండాలో అసదుద్దీన్ ఒవైసీ చూపించారు... దేశంలో మన పౌరసత్వంని మనం రుజువు చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందంటే దీని అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదని నాని ధ్వజమెత్తారు. ఇక మీరు ఇచ్చే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డులు పని చేయవు... పేద మధ్య తరగతి వాళ్ళు ఎన్ఆర్సీ, సీఏఏ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్సీ, సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ 22 మంది ఎంపీలు ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేశారు... మా పార్టీలో ఇద్దరు ఎంపీలు కూడా అనుకూలంగా ఓటు వేశారు... నేను ఓటు వేయకుండా బయటికి వచ్చానని నాని కుండబద్దలు కొట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్సీ, సీఏఏలపై వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే టీడీపీ ఎమ్మెల్యేలు లు దానికి మద్దతు తెలుపుతారని... దానికి నేను హామీ ఇస్తున్నానని నాని చెప్పారు. ఏదేమైనా ఈ విషయంలో నాని బాబును మాత్రం భలే ఇరికించారే అన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. నానికి ఉన్నట్టు ఉండి మళ్లీ ఏమైందిరా బాబు బాబును ఇలా టార్గెట్ చేశారని టీడీపీ వాళ్లు సైతం జుట్టు పీక్కుంటున్నారు.