కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి) ఆధ్వర్యంలో కళాజాత బృందాలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పై హైదరాబాద్, బృందాలకు హైదరాబాద్, కవాడిగూడ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాగణంలో అవగాహన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఆర్పిఎఫ్ (సదరన్ సెక్టార్)కు చెందిన ఎం.ఆర్.నాయక్, ఐపిఎస్, ఐజి, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెంట్ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్ల నక్సల్ అవాంఛనీయ సంఘటనలు చాలా వరకు తగ్గాయన్నారు.
గతంతో పోలిస్తే దేశంలో నక్సల్ కార్యకలాపాలు ప్రస్తుతం అతికొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. సివిక్ యాక్షన్ ప్రోగామ్ (సిఎపి-సి.ఆర్.పి.ఎఫ్), గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ (జిసిసి) వంటి పలు కార్యక్రమాల ద్వారా గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్. వెంకటేశ్వర్, డిజి, పిఐబి మాట్లాడుతూ, కళాకారులు - వివిధ కళారూపాలలో గిరిజనులకు విద్య, పారిశుధ్యం, పౌష్టికాహారం సంబంధిత ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ, జాయింట్ డైరెక్టర్ విక్రమ్ కుమార్, విశ్వనాథ్, సిఆర్పిఎఫ్ (సదరన్ సెక్టార్) కమాండెంట్, తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ జాయింట్ డైరెక్టర్, సముజ్వల, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, డిప్యూటీ డైరెక్టర్, ఎం. మహేష్.. కళాజాత బృందాలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహనా కార్యక్రమంలో నల్గొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, జనగాం, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన 23 కళాజాత బృందాలు పాల్గొన్నాయి.
ఈ బృందాలు ఈ నెల 26 నుండి 28 వరకు భద్రాద్రి -కొత్తగూడెం జిల్లాలోని 13 మండలాలలో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన ప్రదర్శనలు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమంలో హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఒబి, ఇంకా నల్గొండ, నిజామాబాద్ కు చెందిన క్షేత్ర ప్రచార అధికారులు పాల్గొన్నారు.