ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఎందరో రాజకీయ నేతల యొక్క జీవిత కాల కల అయిన ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకునేందుకు సహకరించిన ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసం విశేష కృషి చేసిన ఆయన అందరి దృష్టి మళ్లీ ఆకర్షించారు. ఇలాంటి కీలకమైన నేత నేరుగా రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. బీహార్లో అధికారంలో ఉన్న జేడీ(యూ) నుంచి ప్రశాంత్ కిషోర్ ఇటీవలే బహిష్కరణకు గురవడం చర్చకు దారి తీసింది. అయితే, తాజాగా ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ) నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిషోర్ మొదటిసారిగా పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై విమర్శల దాడి చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు పాటిస్తున్నామని నితీశ్ చెప్తుంటారని, కానీ అధికారం కోసం ఆయన గాడ్సేకు మద్దతిచ్చే వారి(బీజేపీ) పక్షాన నిలిచారని వ్యాఖ్యానించారు.
జేడీ(యూ)లో చేరకముందు నుంచే నితీశ్ తనకు తండ్రిలాంటి వారని ఆయన గురించి చెడుగా మాట్లాడలేనని అంటూనే ఆయన్ను ఎండగట్టేలా ప్రకాశ్ కిషక్షర్ మాట్లాడారరు. నితీష్తో విభేదాలు తలెత్తిన మాట నిజమేనని అంగీకరించారు. గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని చెప్పుకొనే నితీశ్ బీజేపీతో జతకట్టారని విమర్శించారు. ‘గాంధీజీ, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ఎన్నటికీ విడువబోనని నితీశ్జీ తరచుగా చెప్తుంటారు.. అదే సమయంలో ఆయన గాడ్సే సిద్ధాంతాలను నమ్మే వారితో కలిసి సాగుతున్నారు. గాంధీ, గాడ్సే కలిసి ఉండలేరు. మీరు బీజేపీతో జత కట్టాలనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీరు రెండు సిద్ధాంతాలతో ముందుకు సాగలేరు’ అని పేర్కొన్నారు. ఈ అంశంపై తనకు, నితీశ్కు మధ్య చాలాకాలంపాటు చర్చలు జరిగాయని ప్రశాంత్ చెప్పారు. ఓ పార్టీ నాయకునిగా మీరు (నితీశ్) ఏవైపు ఉన్నారో స్పష్టం చేయాల్సిన అవసరముంది అని నితీష్ అన్నారు.
‘ఎన్నికల వ్యూహకర్తగా వివిధ రాజకీయ పార్టీలతో నాకున్న అనుబంధం అందరికీ తెలిసిందే. దానిని నేనెప్పుడూ రహస్యంగా ఉంచలేదు. కానీ మరో పార్టీ ఏజెంటుగా నేను జేడీ(యూ)లో చేరలేదు. అబద్ధాలతో ఇతరులను ఎదుర్కొనవచ్చని అనుకుంటే.. ఆ పని నాకు తండ్రి లాంటి నితీశ్కుమార్ చేశాడని చెప్తాను’ అంటూ ప్రశాంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘బీజేపీకి దూరమైన నితీశ్ 2014లో ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి, కేవలం రెండు సీట్లు గెలుపొందారు. అయినప్పటికీ నితీశ్ బీహార్ ప్రజల ఆశాదీపంగానే ఉన్నారు. కానీ నేటి పరిస్థితి చూడండి.. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే పక్షనేతగా నితీశ్ ఉంటారని మరో పార్టీకి చెందిన ఓ గుజరాతీ నాయకుడు (అమిత్షా)భరోసా ఇస్తున్నాడు. అంటే ఇంతకుముందు నితీశ్ బీహార్ వాసులకు నాయకునిగా కాకుండా ఓ సంస్థకు మేనేజర్గా పనిచేసినట్టా?. తమ నాయకుడు మరొకరిపై ఆధారపడటాన్ని బీహార్ వాసులు సహించలేరు. ఒకప్పుడు బీహార్లో బీజేపీ తరఫున ప్రచారం చేయకుండా మోదీని అడ్డుకున్న నితీశ్.. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా అమిత్షా, నడ్డా అనుచరునిలాగా ప్రచారం చేయడం దయనీయం’ అంటూ విచారం వ్యక్తం చేశారు.