మోసపూరిత‌ మాటలు.. జీవితాలతో ఆటలు.. అమాయకులను బురిడీ కొట్టించి లక్షలు కాజేస్తున్న హైద‌రాబాద్ కిలేడీ. స్నేహం పేరుతో యువకులకు మాయ‌మాటులు చెప్పి ముగ్గులోకి దించుతుంది. ఈ క్ర‌మంలోనే వారితో శారీరకంగా దగ్గరవుతుంది. ఆ బాగోతాన్ని సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడి అందినంత దోచుకుంటున్న ఓ హైద‌రాబాద్ కిలేడీ గుట్టు ర‌ట్టు చేశారు పోలీసులు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పతంగి మహేశ్వరి(22) అనే యువతి టెన్త్ క్లాస్ వరకే చదివింది.

 

భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అతడికి దూరమైంది. ప్రస్తుతం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పరిధి వసంత్‌నగర్‌లో తండ్రితో కలిసి నివసిస్తోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె ఈజీ మనీ సంపాదించాలన్న ఆశతో అడ్డదారులు తొక్క‌డానికి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఇంకా వివాహం కాలేద‌ని, బీటెక్ చదివి ఓ కార్పోరేట్ సంస్థలో పనిచేస్తున్నానని, ఆసక్తి గలవారు సంప్రదించాలని కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నమ్మిన మాదాపూర్ కావూరి హిల్స్‌కు చెందిన యువకుడు ఆమెను సంప్రదించాడు. మాయ మాట‌ల‌కు ప‌డిపోయిన అత‌డు కొన్ని రోజులు పాటు అమె చుట్టూనే తిరిగేవారు. 

 

ఇక వీరిద్ద‌రి పరిచయం కాస్తా శారీరక సంబంధం వరకు వెళ్లింది.  2019  డిసెంబర్ 14న ఇద్దరూ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్‌లో మూడు గంటల పాటు ఎంజాయ్ చేశారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు యువ‌కుడికి తెలియ‌కుండా మహేశ్వరి సీక్రెట్ కెమెరా ద్వారా రాసలీలలను రికార్డ్ చేసింది. ఆ త‌ర్వాత మ‌హేశ్వ‌రి తన ఫ్రెండ్ సంతోష్‌తో కలిసి కేపీహెచ్‌బీ పోలీసుల పేరుతో బెదిరించింది. దీంతో ప‌రువు పోతుంద‌ని భావించిన ఆ యువకుడు ఐఫోన్‌తో పాటు రూ4.50లక్షలు వారికి సమర్పించుకున్నాడు. 

 

సంతృప్తి చెంద‌ని మ‌హేశ్వ‌రి ఇంకా డబ్బులివ్వాలంటూ వేధించడంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. ఆ త‌ర్వాత ప‌క్కా ప్లాన్‌తో వారిద్దరిని ఇనార్బిట్ మాల్‌ వద్దకు రమ్మని చెప్పిన యువకుడు మహేశ్వరి, సంతోష్‌ను పోలీసులకు పట్టించాడు. ఇక నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: