మాయమై పోతున్నడమ్మో మనిషన్న వాడు.. అని ఓ కవి చెప్పిన మాటలు ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తాయి. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను కడ తేరుస్తున్న కొడుకులు, కన్న పిల్లలని చూడకుండా ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు, వాయి వరసలు మరిచి కూతుళ్ల మీద అత్యాచారం చేస్తున్న మృగాళ్లు, భార్య కూడా ఓ మనిషే అని మరిచి చిత్ర హింసల పాలు చేస్తేన్న దుర్మార్గులు ఎక్కువతున్నారు.

 

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య అన్న కనీస కనికరం కూడా లేకుండా ఇల్లాలిని చితకబాదాడు ఆమె భర్త. అనుమానం పెంచుకొని రోజూ దారుణంగా హింసించాడు. అంతేకాదు ఆమెను తీవ్రంగా కొట్టి  ఆ తరువాత ఇంటి ముందున్న మురికికాల్వలో పడేశాడు. నెల్లూరు జిల్లా కావలిలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. రమీజా, షేక్ షరీఫ్ భార్యా భర్తలు. కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.

 

ఐతే ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. నిత్యం ఆమెను టార్చర్ పెడుతున్నాడు. ఆ క్రమంంలో బుధవారం రాత్రి కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. రమీజాపై కోపంతో ఊగిపోయిన షేక్ షరీఫ్.. ఆమెను విపరీతంగా కొట్టాడు. షరీఫ్‌ సోదరి కూడా ఇందుకు సహకరించింది. సోదరుడిని ఆపాల్సింది పోయి.. రమీజాను తాను కూడా హింసించింది. ఇద్దరు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి ఇంటి ముందున్న డ్రైనేజీలో పడేశారు.

 

అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా మురికికాల్వలోనే ఉండిపోయింది. ఉదయం స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు రమీజాను డ్రైనేజీ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రమీజా భర్త, అతడి సోదరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: