మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. అయితే ఈ సేవలను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ సహకారంతో ఈ సేవలను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లడానికి ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేశారు.  

 

 

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలను మొత్తం 3 రకాల ప్యాకేజీల్లో అందిస్తున్నారు. ప్యాకేజీ-1లో భాగంగా వేములవాల నుంచి వ్యూ పాయింట్‌ కు 7 నిమిషాల రైడ్‌ కు టికెట్‌ ధర రూ.3 వేలు. ప్యాకేజీ- 2లో వేములవాడ మిడ్‌ మానేరు పరిసర ప్రాంతాలు వీక్షించడానికి రూ.5,500. ఈ ప్యాకేజీ కోసం కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం కల్పిస్తారు. ప్యాకేజీ- 3లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు తీసుకెళ్లి దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్‌ కు తీసుకొస్తారు. టికెట్‌ ధర రూ.30 వేలు. ఈ ప్యాకేజీ కోసం కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.                

 

 

 వేములవాడ హెలికాప్టర్ సేవల బుకింగ్‌ కోసం 09400399999, 09880505905, 07994481767, 09544444693 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ హెలికాప్టర్ సేవలను తెలంగాణ పర్యటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సేవలను ఫిబ్రవరి 23 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

 

అయితే శివరాత్రి నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తుతారు. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఏటా పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా సిద్దిపేట మీదుగా చేరుకోవాల్సి ఉంది. హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రావడం ఆర్థికంగా కలిగిన భక్తులకు ఊరటనిచ్చే అంశం అన్నారు. ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో మధ్య తరగతి వారు కూడా సరదాగా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: