అసలే పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో పాటు ప్రజల్లో రోజు రోజుకు పార్టీపై నమ్మకం కోల్పోతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో తెలియడం లేదు. ఓ వైపు ప్రజా చైతన్య యాత్రలు అంటూ అప్పుడే జనాల్లోకి వెళుతున్నారు. మరో వైపు పార్టీ నేతలను ఎక్కడిక్కడ జనాల్లో ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. ఓ వైపు బాబోరు ఇన్ని బాధలు పడుతుంటే మరో వైపు పార్టీ నేతలు మాత్రం ఆయన్ను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరులు నీళ్లు తాగించేస్తున్నారు. వీరిలో విజయవాడ ఎంపీ కేశినేని ప్రముఖంగా ఉన్నారు.
చంద్రబాబును ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తోన్న కేశినేని నాని విజయవాడ రాజకీయాలకే కాదు, చంద్రబాబుకి కూడా ఆయన ఎందుకు తలనొప్పిగా మారారు. నానిది ముందు నుంచి ముక్కు సూటి వ్యక్తిత్వం కావడంతో ఆయన ఏం చెప్పాలనుకున్నా... మనస్సులో ఏమున్నా పార్టీకి ఎంత ఇబ్బందో అని చూడకుండా కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఇక విజయవాడ అర్బన్ పార్టీ ఆఫీస్ను మార్చి నప్పుడు ఆయన చేసిన కామెంట్లు.. బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఆడుకున్నప్పుడు ఇలా బాబుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాను టార్గెట్ చేయడం... ఇక కొడాలి నానికి మంత్రి పదవి రావడం వెనక ఉమా చాలా సాయం చేశారంటూ.. సెటైర్లు వేయడం... ఇక సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. మీరు అధికారంలోకి రావడానికి. మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైన ఏబీ వెంకటేశ్వరరావును సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో పెట్టడంతో బాబుకు ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదు.
ఇక ఎన్నార్సీ విషయంలో టీడీపీ బిజెపికి మద్దతు ఇచ్చింది. కాని కేశినేని నానీ మాత్రం ఎన్నార్సీని వ్యతిరేకించే విషయంలో టీడీపీ మద్దతు ఇస్తుందని… అలా జరగకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తాననడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు నాని మజ్లిస్తో స్నేహం చేయడాన్ని బట్టి చూస్తే ఇదో పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. ఏదేమైనా నాని తీరుత బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.