అవకాశాలు ఉన్న అదృష్టం కలిసి రాకపోతే ఏ నాయకుడికైనా రాజకీయాల్లో ఇబ్బందులు తయారవుతాయి. సరిగా ఇలాంటి ఇబ్బందులే వైసీపీలో ఉన్న యువ నాయకుడు దేవినేని అవినాష్ పడుతున్నట్లు తెలుస్తోంది. తండ్రి దేవినేని నెహ్రూ ద్వారా కాంగ్రెస్లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన అవినాష్, 2014 తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లారు. ఇక నెహ్రూ మృతి చెందడంతో, ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాడు.
అతి తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. టీడీపీలో తెలుగు యువత అధ్యక్షుడుగా మంచి యాక్టివ్ రోల్ పోషించారు. ఇక 2019 ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ అవసరంలో బలైపోయాడు. చంద్రబాబు అవినాష్కు గుడివాడ టికెట్ ఇచ్చారు. బలమైన కొడాలి నానినీ ఢీకొట్టడం అవినాష్కు సాధ్యం కాలేదు. ఓడిపోయాడు. ఓడినా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం కష్టపడటం మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో కొందరు సీనియర్ నేతల కుళ్ళు రాజకీయాలకు చిరాకొచ్చి వైసీపీలోకి వచ్చేశారు.
వైసీపీలోకి రావడమే అవినాష్కు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు అనుకూలమైన విజయవాడ తూర్పు సీటు ఇన్ చార్జ్గా నియమించారు. పదవి రావడమే అవినాష్ కష్టపడుతూ, పని చేసుకుంటున్నారు. కానీ భవిష్యత్లో ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం రావడం కష్టమని అర్ధమవుతుంది. తూర్పులో బలంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ని ఢీకొనడం అంత సాధ్యపడని విషయమని తెలుస్తోంది.
ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ హవా ఉన్న, రామ్మోహన్ మాత్రం 15 వేలపైనే మెజారిటీతో వరుసగా రెండోసారి గెలిచారు. జగన్ గాలి గద్దెని ఏం చేయలేకపోయింది. ఓడిపోయినా గద్దె బాగా పని చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రభుత్వ నిధులు అందకపోయిన, తన సహచర విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.
అటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ... సమస్యల పట్ల త్వరగా స్పందిస్తున్నారు. పైగా మూడు రాజధానులు నిర్ణయం గద్దెకు ప్లస్ అయితే, అవినాష్కి మైనస్ అయింది. అలాగే తాజాగా రేషన్, పెన్షన్ల తొలగింపుపై గద్దె పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తుంటే భవిష్యత్లో తూర్పులో గద్దెకు తిరుగుండదని, అవినాష్కు ఇబ్బందులు తప్పవని అర్ధమవుతుంది.