అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించనున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే.. ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ట్రంప్ పర్యటనలో భాగంగా ఘన స్వాగతం పలికేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. ట్రంప్ అహ్మదాబాద్లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఆ ఏర్పాట్ల కోసం దాదాపు రూ.85 కోట్లు చేస్తోంది. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మొతేరా స్టేడియాన్ని అలంకరించారు. రోడ్లను ఆధునీకరించడానికే రూ.30 కోట్లను ఖర్చు చేసిందట గుజరాత్ ప్రభుత్వం. ఇంకా ట్రంప్ ప్రయాణించే రహదారి వెంబడి విద్యార్థులలో సంప్రదాయ క్రీడ మల్లకంబను ప్రదర్శించనున్నారు.
ఇక ట్రంప్ ప్రయాణించే రహదారి ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరించారు. ట్యాంకర్లలో నీళ్లను తెచ్చి రోడ్లన్ని శుభ్రం చేశారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న ప్రధాన మార్గాల్లో రోడ్లన్ని అద్దంలా మెరిసిపోతున్నాయి.
ట్రంప్ షెడ్యూల్.. ఫిబ్రవరి 24 న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు స్వాగతం పలుకుతారు. అనంతరం సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్ లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. తర్వాత మొతేరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.
అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు.
ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 25.. రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ట్రంప్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. మోదీ, ట్రంప్ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. రాత్రి పదింటికి అమెరికాకు ప్రయాణమవుతారు.