అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన పర్యటిస్తోన్న గుజరాత్లో అహ్మదాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ట్రంప్ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్ను ఓ రేంజ్లో ముస్తాబు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నగర శుభ్రత విషయంలో అహ్మదాబాద్ కార్పోరేషన్కు సీరియస్గా వార్నింగ్లు ఇచ్చారు. దీంతో అహ్మదాబాద్ మేయర్ ఆధ్వర్యంలో పర్యటన ఏర్పాట్లు ఓ రేంజ్లో నడుస్తున్నాయి.
ఇక ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం వరకూ రోడ్ షో కొనసాగనుంది. ఈ రోడ్ షో మార్గంలోనే సుమారు అర కిలో మీటర్ మేర దేశ శరణం అనే మురికివాడ ప్రాంతం ఉంది. ఈ మురికి వాడ అహ్మదాబాద్ నగరంలోనే పెద్దది. దీంతో ట్రంప్ వెళ్లే మార్గంలో ఈ మురికివాడ ఉంటే చూడడానికి దరిద్రంగా ఉంటుందని ఏకంగా అహ్మదాబాద్ కార్పొరేషన్ ఈ మురికివాడ ట్రంప్కు కనపడకుండా ఓ ప్లాన్ వేసింది.
ట్రంప్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ మురికివాడ ఫ్రేమ్ ట్రంప్ వెళ్లే మార్గంలో కనపడకుండా సుమారు ఏడు అడుగుల ఎత్తు వరకు గోడ కట్టేస్తున్నారు. దీంతో ఈ మురికివాడ వాసులు షాక్కు గురవుతున్నారు. ఇప్పటి వరకు తమ గోడును పట్టించుకున్న వాళ్లే లేరని.. అయితే ఇప్పుడు ఏకంగా ఆ మురికి వాడ కనపడకుండా గోడ కొట్టేస్తున్నారని.. ఆ ఖర్చు తమ మురికివాడలో రహదారులు పోసేందుకు పెట్టినా చాలా రహదారులు బాగుపడతాయని అంటున్నారు.
ఇక గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరబాద్లో పర్యటించారు. క్లింటన్ హైదరాబాద్ వచ్చిన సమయంలో బిచ్చగాళ్లను అరెస్టు చేయించడం.. ఊరవతల కు పంపించి నిర్బంధించడం వంటి ఘటనలు జరిగాయి. అలాగే అప్పట్లో హైదరాబాద్ రహదారులకు కూడా చంద్రబాబు గంతులు పూడ్పించడం.. గోడలకు రంగులు వేయించడం వంటివి చేశారు.