మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల సోమవారం భారత్‌ కు చేరుకున్నారు. రానున్న డిజిటల్‌ యుగంలో దూసుకుపోయేందుకు  దేశంలోని వ్యాపారవేత్తలు తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతిలో మిళితమై ఉన్న ఈ సామర్ధ్యాలను భారత సీఈవోలు అలవర్చుకోవాలన్నారు. డిజిటల్‌ టెక్నాలజీ చిన్న పెద్ద అన్ని రంగాల్లోనూ కీలక పాత్రపోషించనుందని, ఈ నేపథ్యంలో భారతదేశంలో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లకు 72 శాతం ఉద్యోగాలు టెక్నాలజీ పరిశ్రమకు వెలువల ఉన్నాయని నాదెళ్ల తెలిపారు.  

 

 

సాంప్రదాయ కంప్యూటింగ్ వ్యవస్థలను క్లౌడ్‌ కు మార్చడం, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత పై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. వచ్చే దశాబ్దంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి టెక్నాలజీలో తమ సొంత సాంకేతిక సామర్థ్యాలను నిర్మించుకోవాలని నాదెల్లా కంపెనీలను కోరారు. ఇది మరింత సమగ్ర వృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ముంబైలో  ఫ్యూచర్ డీకోడ్ సీఈవో సమ్మిట్ లో ఆయన ప్రసంగించారు.

 

 

ఈ కార్యక్రమంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఎండీ రాజేష్ గోపీనాథన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్య శిక్షణలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. దేశంలోని యువతకు అపారమైన శక్తి సామర్థ్యాలున్నాయని, అలాగే త్వరగా నేర్చుకునే తత్వం వారి సొంతమని, అయితే దానిపై వారికి శిక్షణ అవసరమని ఆయన అన్నారు. 2020 నాటికి ఎగైల్ టెక్నాలజీలను పూర్తిగా స్వీకరించడానికి  తాము సిద్ధంగా ఉన్నామని, తమ డెవలపర్‌లలో 59 శాతం మంది ప్రస్తుతం ఎగైల్‌ పైనే పనిచేస్తున్నారని టీసీఎస్‌ సీఎండీ తెలిపారు.

 

 

భారతదేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరించే అవకాశముందని  రిలయన్స్‌ అధినేత ముకేశ​ అంబానీ పేర్కొన్నారు. అలాగే జియో ఆవిష్కారం అనంతరం భారత్‌లో డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొచ్చామన్నారు.  తద్వారా దేశంలోని  మారుమూల గ్రామాలకు కూడా డేటా సౌకర్యాన్ని అందించడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: