విజయనగరం జిల్లాలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో కొన్ని ఉద్వేగభరిత దృశ్టయాలు చోటుచేసుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన కట్టె కాలే వరకు సీఎం వైయస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తానని భావోద్వేగంతో చెప్పారు. గిరిజన ప్రాంతంలో పుట్టి గిరిజన సంక్షేమ పాఠశాలలో నేల మీద కూర్చొని చదివిన తనను గిరిజన సంక్షేమ మంత్రిని చేసి.. ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చినందుకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే.. “ ప్రపంచాన్ని జయించగల ఏకైక ఆయుధం విద్య అని నెల్సన్మండేలా చెప్పారు. ప్రతి పేద విద్యార్థి తన చిన్ననాటి నుంచి ఉన్నతస్థాయికి వెళ్లే వరకు ఎన్నో కలలు కంటాడు. కానీ, ఉన్నత స్థాయికి వెళ్లేలోపు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటాడు. ఆర్థిక స్తోమత లేకపోవడం, సరైన పుస్తకాలు, దుస్తులు లేకపోవడం, స్కూల్కు వెళ్లేటప్పుడు పౌష్టికాహారం లేకపోవడం, ఇదిలా ఉంటే మౌలిక సదుపాయాలు లేని పాఠశాలలు.. ఆ తరువాత కాలేజీకి వెళ్తే తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితి..
డిగ్రీ స్టేజీలో హాస్టల్ ఫీజులు కట్టలేని పరిస్థితి.. డిగ్రీ పట్టాలు పట్టుకున్న తరువాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే ఇంగ్లిష్ మాట్లాడడం సరిగ్గా రాక వెనుదిరిగిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ఒక పేద విద్యార్థి ఎదుర్కొనే అవరోధాలు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు జరిగితే తప్ప ఆ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోలేరు. మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాదయాత్రలో నేను విన్నాను.. నేను ఉన్నానని ధైర్యం చెప్పారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, మన బడి నాడు–నేడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లిష్ మీడియం విద్య తీసుకువచ్చారని గుర్తు చేసుకున్నారు.