కారణాలు ఏవైనా...అనేకమంది దంపతులు విడిపోతున్నారు. పిల్లల్ని కన్న తర్వాత, పిల్లల్ని కనకుండానే తమ జీవితం తాము చూసుకుంటున్నారు. అలాంటి వారిలో కొందరికి పిల్లల్ని కనాలి అని ఉంటుంది. వీరి విషయంలో ముఖ్యంగా మహిళలకు వర్తించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అద్దెగర్భం (సరోగసీ) విషయంలో తాజాగా అందుబాటులోకి వచ్చిన నిర్ణయాలను భారత సర్కార వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ అద్దెగర్భం నియంత్రణ బిల్లు-2020కు ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతీ ఇరానీ మీడియాకు వివరాలు వెల్లడించారు.
అద్దె గర్భానికి అంగీకరించే మహిళ.. దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధనతోపాటు నాటి బిల్లులోని పలు ప్రతిపాదనలపై విమర్శలు రావడంతో కేంద్రం ఆ బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి పలు సిఫార్సులు చేసింది. తాజా బిల్లు ప్రకారం.. అద్దెగర్భం ఇచ్చేందుకు మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. అలాగే విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా సరోగసీ ద్వారా బిడ్డను కనొచ్చు. సరోగసీ నియంత్రణకు జాతీయ, రాష్ట్రస్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటుచేస్తారు. సరోగసీకి సిద్ధపడే మహిళకు బీమా సౌకర్యాన్ని 16 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు. వాణిజ్యపరమైన సరోగసీని నిషేధించి, ‘నిస్వార్థమైన’ సరోగసీని అనుమతించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకువచ్చినట్లు చెప్పారు. వచ్చే నెలలో ప్రారంభంకానున్న మలివిడుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
2019 ఆగస్టులో లోక్సభ ఆమోదం పొందిన సరోగసీ ముసాయిదా బిల్లుకు పలు సవరణలు చేసి తాజా బిల్లు తెచ్చారు. భారతీయ దంపతులు మాత్రమే దేశంలో సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని ఎంచుకునేలా ప్రతిపాదనలు పొందుపరిచినట్లు స్మృతీ ఇరానీ తెలిపారు.