సీఎం కాన్వాయ్ వస్తుంది అంటే సెక్యూరిటీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దారి పొడవునా పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. ఇక సీఎం కాన్వాయ్ కూడా ఎంతో వేగంగా దూసుకు పోతూ ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేలోపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ సీఎం కాన్వాయ్ దారిలో అనధికారికంగా ఎక్కడైనా ఆగింది అంటే ఒక్కసారిగా సెక్యూరిటీ మొత్తం అలెర్ట్ అయిపోతారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మొన్నటికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తితో కాన్వాయ్ ను ఆపి మరీ మాట్లాడగా... తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అలాంటిదే చేశాడు.
వివరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి కేసీఆర్ టోలిచౌకి వెళ్తున్న సమయంలో... రోడ్డు పక్కనే సలీం అనే వికలాంగున్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు. వెంటనే కారు ఆ వికలాంగుడు దగ్గరికి వెళ్ళాలి అంటూ ఆదేశించారు. ఇక అక్కడికి వెళ్లగానే వికలాంగుడు సలీం ను ఆప్యాయంగా పలకరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సమస్య ఏంటి..? పెన్షన్ వస్తుందా..? ఇల్లు ఉందా..? ఎక్కడ ఉంటున్నావ్..? అంటూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనకు పెన్షన్ రావడం లేదని ఇల్లు లేదు అంటూ సలీం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పడంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆ వికలాంగుడు సమస్యను పరిష్కరించారు
వెంటనే హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి కి చరవాణి ద్వారా సంపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్... వికలాంగులు సలీం వివరాలను ఆయనే స్వయంగా తెలిపారు. పెన్షన్ తో పాటు ఆ వ్యక్తికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా మంజూరు చేయాలని ఆదేశించారు. ఇక ఏకంగా ముఖ్యమంత్రి తన సమస్యను పరిష్కరించడం తో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి తన కోసం కారు ఆపి సమస్యలు అడిగి ఓపికగా తెలుసుకొని తన సమస్యను పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ సలీం తెలిపారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.