భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాస గౌడ...5: ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జమైకాకు చెందిన ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ను కూడా తలదన్నేరీతిలో పరుగులు తీసిన సంగతి తెలిసిందే. కంబళ పోటీల్లో ప్రపంచ పరుగుల చిరత కంటే వేగంగా పరుగెత్తి రికార్డు సొంతం చేసుకున్న శ్రీనివాస గౌడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకోనున్నాడు. ఇండియన్ ఉసేన్బోల్ట్ రన్నింగ్ ట్రాక్ ఎక్కనున్నాడు. శాయ్ అధికారులు బెంగళూరులో శ్రీనివాసకు శిక్షణనివ్వనున్నారు.
కర్ణాటకలో సంప్రదాయంగా నిర్వహించే కంబళ క్రీడా పోటీల్లో 142.50 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకండ్లలో చేరుకున్న శ్రీనివాస గౌడపై ఆనంద్ మహీంద్రా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర్ రావు, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. శ్రీనివాస గౌడకు 100 మీటర్ల అథ్లెట్గా సరైన తర్ఫీదును ఇవ్వడం ద్వారా లేదా ఒలింపిక్ క్రీడల్లో కంబళ క్రీడను ప్రవేశపెట్టడం ద్వారా.. అతనికి బంగారు పతకం వచ్చేలా చేయాలని ఆనంద్ మహీంద్ర కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును కోరారు. దీనికి స్పందించిన మంత్రి.. శ్రీనివాసను సాయ్కు పిలిపిస్తామని, అక్కడ నిపుణులైన కోచ్లు అతనికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ‘సాయ్ అత్యున్నత నిపుణులు నిర్వహించే పరీక్షల కోసం శ్రీనివాస గౌడను పిలిపిస్తాం. ఒలింపిక్ క్రీడల్లో భాగంగా నిర్వహించే అథ్లెట్ పోటీలకు కావలసిన ప్రమాణాలపై మనదగ్గర చాలామందికి సరైన అవగాహన లేదు. నైపుణ్యం కలిగిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోం’ అని తెలిపారు.. గౌడకు సరైన తర్ఫీదునిస్తే దేశానికి కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాడని బీజేపీ నేత పీ మురళీధర్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, శ్రీనివాస గౌడని బెంగళూరు సాయ్ కేంద్రానికి తీసుకువచ్చి అక్కడి కోచ్లు అతనికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపింది. అలాగే క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఔత్సాహికులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. కాగా, ఈ ఏడాది కంబళ పోటీలు ముగిశాక, ఏప్రిల్లో శ్రీనివాస శిక్షణ కేంద్రంలో చేరే అవకాశముంది.
తనపై ఇంతటి ప్రశంసల వర్షం కురుస్తున్నప్పటికీ, శ్రీనివాస గౌడ మాత్రం ఎంతో వినయంగా స్పందించారు. కంబళ పోటీలో పరిగెత్తిన తనను ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ట్తో పోలుస్తున్నారని, ఆయన ప్రపంచ ఛాంపియన్ అని, కానీ తాను బురద నేలల్లో పరిగెత్తేవాడినని మీడియాతో వ్యాఖ్యానించటం విశేషం.