దేశంలో అల్లర్లకు పెరిగిపోతున్నాయి. సిఏఏ కు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఇప్పుడు ఉద్రిక్తకరంగా మారి అల్లర్లకు దారితీశాయి. దీనికి ఉదాహరణ ఢిల్లీ ఘటన అని చెప్పాలి. ఢిల్లీలో ఇప్పటికే చాంద్ బాగ్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించారు. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటె, ఈ అల్లర్ల వలన ఇప్పటి వరకు దాదాపుగా 35 మంది మరణించారు. నిరసనల ముసుగులో అల్లర్లు సృష్టించడంతో ఢిల్లీ మొత్తం అట్టుడికి పోయింది. ఇదిలా ఉంటె, ఈరోజు శుక్రవారం. ముస్లింలు మసీద్ లలో నమాజులు చేసుకుంటారు. ఈ సమయంలో దేశంలో ఎలాంటి ఆందోళనకు, ఉద్రిక్తరమైన పరిస్థితులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా డిల్లీ, ఘజియాబాద్ లలో భద్రతా కట్టుదిట్టం చేసారు.
ఘజియాబాద్ లో అత్యవసర పరిస్థితిని తలపించే విధంగా పోలీసులు మోహరించారు. ఘజియాబాద్ మొత్తం పోలీసుల పహారాలో ఉండిపోయింది. ఇక సోషల్ మీడియాలో అల్లర్ల గురించి ఉద్రేకపరిచే విధంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఘజియాబాద్ లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, అటు ఢిల్లీ లో కూడా ఇదే విధమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సిఏఏ విషయంలో చెలరేగిన అల్లర్లకు కేంద్ర హోంశాఖ బాధ్యత వహించాలని, బాధ్యత వహించి అమిత్ షా రాజీనామా చేయాలనీ డిమాండ్లు వస్తున్నాయి. గుజరాత్ లో జరిగిన అల్లర్లను ఢిల్లీ అల్లర్లతో పోలిక పెడుతున్నారు. అప్పట్లో గుజరాత్ లో షా హోమ్ మంత్రిగా ఉండగానే అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం. అయితే, ఢిల్లీ అల్లర్ల వెనుక ఆప్ నాయకుల హస్తం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు.