నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి.. ఆ తర్వాత చేతులు దులిపేసుకునే రకం కానే కాదు వైఎస్ జగన్. మాట ఇచ్చే ముందు వెయ్యిసార్లు ఆలోచిస్తారు.. కానీ మాట ఇచ్చేశాక మాత్రం ఆలోచించడం ఉండదు. ఎంత కష్టమైనా.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా సరే లెక్క చేయడం ఉండదు. ఈ విషయం ఇప్పటికే తన తొమ్మిది నెలల పాలనలో అనేక సార్లు రుజువు చేసుకున్నారు వైఎస్ జగన్.

 

 

ఇప్పుడు ఆ విషయం మరోసారి రుజువైంది. తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని జగన్ చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమల్లోకి వచ్చేసింది. వంశపారంపర్య అర్చకత్వం పై జారీ చేసిన జీవో 439 కార్యరూపం దాల్చింది. ఈ ఉత్తర్వులను అనుసరించి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం వల్లిపాడు గ్రామానికి చెందిన మదన గోపాల స్వామి ఆలయ అర్చకుడిని నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అందజేశారు.

 

 

అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవరించి అమల్లోకి తెచ్చారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ జీవో తీసుకురావడం ద్వారా అధికారంలోకి రాగానే సీఎం వైయస్‌ జగన్‌ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

 

 

వంశపారంపర్య అర్చకత్వాన్ని కొనసాగించేందుకు జీవోను సవరించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం వైయస్‌ జగన్‌ తనను ఆదేశించారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఏదేమైనా జగన్ నిర్ణయం బ్రాహ్మణ వర్గాల్లో ఆనందం నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: