ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో...ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కుమారుడు తన కుమారుడు అనంత్,ఎంపీ పరిమళ్ నత్వానీతో కలిసి ముఖేశ్ అంబానీ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే, ఈ సమావేశానికి కొన్ని రోజుల ముందే, ఏకంగా 37000 కోట్ల రూపాయల నష్టం ముఖేష్ అంబానీ ఎదుర్కోవడం గమనార్హం.
2020 న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పటికి 4.12 లక్షల కోట్లుగా ఉండేది. మార్కెట్ రిస్క్ భయంతో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపదను నష్టపోయారని బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ తెలిపింది. దీంతో గడిచిన రెండు నెలల్లో రిలయన్స్ ఏకంగా 11 శాతం సంపదను నష్టపోయిందని చెప్పింది. ఇంతకీ ఎందుకు ముఖేష్ ఇంత నష్టపోయారో తెలుసా? కరోనా వైరస్ కారణంగా.
ఔను. 2019 డిసెంబర్ చివరిలో చైనా వుహాన్ సిటీలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ కొద్ది రోజులకే ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. సంక్రాంతి సమయానికి కొత్త వైరస్ పలు దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నడస్తున్న ఇదే సమయంలో చైనాలో అన్ని పరిశ్రమలు ఒక్కసారిగా దాదాపుగా మూతపడిన పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్లలో వణుకు మొదలైంది. దీంతో ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు తమ స్టాక్ హాల్డింగ్స్ను గంపగుత్తగా అమ్మకానికి దిగారు. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్ల పతనం శుక్రవారం కూడా కనిపించింది. రూ.10 లక్షల కోట్ల సంపద ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. దీంతో భారతీయ అపర కుబేరుడిని చైనాలో పుట్టిన కరోనా వైరస్ భారీగా దెబ్బకొట్టిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా 37000 కోట్ల రూపాయలు అంబానీ నష్టపోయారని వివరిస్తున్నారు.
ఇదిలాఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశాలపై సీఎం జగన్తో చర్చించేందుకు ముఖేష్ అంబానీ ఏపీకి విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు అంబానీలకి స్వాగతం పలికారు. ముఖేష్, అనంత్ అంబానీలకు శాలువాలు కప్పిన విజయసాయిరెడ్డి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం సీఎం జగన్, ముఖేష్ అంబానీ వివిధ అంశాలపై చర్చించారు.