సమాజాన్ని దార్లో పెట్టాల్సిన పోలీసులే దారితప్పి వ్యవహరిస్తున్నారు. దిగువ, మధ్య తరగతి అని కనికరం లేకుండా డ్రైవర్లే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా.. హైవే చెక్పోస్ట్ల దగ్గర లారీ డ్రైవర్లు, ఓనర్లు ఎంతో కొంత సమర్పించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీవో అధికారుల బాదుడు గురించి చెప్పనక్కర్లేదు. ఇలా ఒక్కో ట్రిప్పునకు సగటున వారు అక్షరాలా రూ.1,257 వసూలు చేస్తున్నారట.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, బండి రిజిస్ట్రేషన్ లాంటి టైం లో రూ.1500 వరకు సగటు బాధితులు సమర్పించుకుంటున్నారు. దేశం మొత్తం ఉన్న లారీల డ్రైవర్లు, ఓనర్లు కలిసి ట్రాఫిక్, హైవే పోలీసులు, ఆర్టీవో అధికారులు తదితరులకు ప్రతి సంవత్సరం, అక్షరాలా.. 48వేల కోట్ల రూపాయిలు చేతులు తడుపుతున్నారట. ఈ తాజా బొక్కలు... ‘సేవ్ లైఫ్ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ సర్వే చేసి మరి తేల్చింది.
ఇది దేశవ్యాప్తంగా ఉన్న పది భారీ రవాణా కేంద్రాలు (ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిస్ట్ హబ్) పరిధిలో అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించినట్టు భోగట్టా. ఈ సర్వేలో భాగంగా.. 1,217 మంది డ్రైవర్లు, 110 మంది యజమానులను ప్రశ్నించారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఇటీవలే విడుదల చేశారు. దీని ప్రకారం. ప్రతి ట్రిప్పునకు లంచం ఇస్తున్నామని సగటున 82% శాతం మంది డ్రైవర్లు
బల్లగుద్ది చెప్తున్నారు.
ఈ జాబితాలో ముఖ్యంగా.. గువాహటి, చెన్నై, ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నాయి. ముంబైలో అయితే ఏకంగా 93 శాతం మంది నుంచి, ఢిల్లీలో 78శాతం మంది నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. ఒక ట్రిప్పునకు సగటున చెల్లిస్తున్న మొత్తం రూ.1,257. రూల్స్ ప్రకారమే వెళ్తున్నప్పటికీ సదరు అధికారులు వారిపట్ల ఈ గుంజుడు చాలా బాధాకరమని.... ఆయా డ్రైవర్లు, ఓనర్లు వాపోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సమయంలో అయితే మరీ రెచ్చిపోతున్నారట. ఆర్టీవోకి లంచం ముట్టజెపితే గాని పని కావడం లేదని బాధపడుతున్నారు.