రాజకీయాల్లో ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటాయి... రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు వేరే పార్టీలో కొనసాగుతూ ఉంటారు. ఒకే కేటుంబానికి చెందిన సొంత అన్నదమ్ములు సైతం ఎమ్మెల్యే పదవి కోసం వేరే పార్టీల నుంచి ఒకే నియోజకవర్గం లో పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ లో ఉంటే ఆయన భార్య వెళ్లి బీజేపీ కండువా కప్పుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఏపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు టిడిపిలో కొనసాగుతుంటే... ఆయన సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు మరో కుటుంబంలోనూ ఇలాంటి ఆసక్తికర రాజకీయమే నడుస్తోంది.
మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుటుంబం ఇప్పుడు రెండు దారుల్లో ప్రయాణిస్తోంది. టీజీ వెంకటేష్ అసలు బిజెపి లో ఉన్నారా ? అని ప్రశ్నించుకుంటే బహుశా ఆయన కూడా అవునని సమాధానం చెప్పలేరు. సహజంగా వ్యాపారవేత్త అయిన టిజి వెంకటేష్ కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత టిడిపి అధికారంలోకి రాగానే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కోట్లు కుమ్మరించి రాజ్యసభ సీటు కొనుక్కున్నారు. టిడిపి ఓడిన వెంటనే బీజేపీ కండువా కప్పుకున్నారు.
నాలుగు రోజుల క్రితం జగన్ కర్నూలు పర్యటనలో ఆయన సీఎం జగన్కు హెలీకాఫ్టర్ వద్దకు వెళ్లి మరీ కండువా వేసి స్వాగతం పలికారు. అక్కడితో ఆగకుండా జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఇప్పుడు కొడుకు భరత్ మాత్రం కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్లో ఆదివారం (మార్చి 1న) తన పార్టీ వారసుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారికి విందు ఇచ్చారు. ఈ విందులో భరత్ ఉన్నారు. దీంతో తండ్రి వెంకటేష్ బీజేపీలో ఉంటూ జగన్తో సఖ్యత కోసం ట్రై చేస్తుంటే... కొడుకు భరత్ టీడీపీలో ఉంటూ లోకేష్తో స్నేహాలు చేస్తున్నట్లుంది. మరి ఈ రాజకీయంకు జనాలు ఎలా ఓట్లేస్తారో ? తెలియడం లేదు.