ప్రస్తుతం అంతా ప్రపంచాన్ని స్మార్ట్ఫోన్ యుగం శాసిస్తోంది. ఎవరికివారు అర చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టుకొని సోషల్ మీడియాను ఉపయోగిస్తూ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో వీక్షిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడో ఉన్న వాళ్లంతా సోషల్ మీడియా అనే కుగ్రామం తో ఒక్కటై పోతున్నారు. సోషల్ మీడియా అనేది ప్రపంచ సరిహద్దులు చెరిపేసింది. సోషల్ మీడియాను సరిగా వాడుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ? అన్ని మైనస్లు కూడా ఉన్నాయి. చాలా మంది పోకిరీ అబ్బాయిలు సోషల్ మీడియాలో అమ్మాయిలను వేధించడం ఇప్పటి వరకు చూశాం.. అయితే ఇందకు రివర్స్ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరుకు చెందిన ఓ యువకుడు డిగ్రీ (బీఎస్సీ) చదువుతున్నాడు. అయితే మూడు నెలల క్రితం అతడు అదే జిల్లాలోని వినుకొండకు చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపాడు. అప్పటి నుంచి వాళ్లు చాటింగ్ చేసుకుంటున్నారు. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడిని కోరింది. తాను కేవలం ఫ్రెండ్ను మాత్రమే అని పెళ్లి చేసుకోనని ఆ యువకుడు చెప్పడంతో ఆగ్రహించిన ఆ యువతి ఆ యువకుడిని పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించింది.
షాక్ తిన్న ఆ యువకుడు ఈ విషయం తల్లికి చెప్పగా ఆ తల్లి వినుకొండ వెళ్లి ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కూతురును మందలించాల్సిన ఆ యువతి తల్లిదండ్రులు కూడా ఆమెకే వత్తాసు పలికారు. మా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. కాబట్టి మా అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సింది. లేకపోతే అతడిని చంపేస్తామన్నారు. దీంతో ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీంతో ఆ యువకుడి తల్లి లబోదిబో మంటూ ఆ కిలాడీ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తనగోడు చెప్పుకుంది. తన కుమారుడిని ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల బారి నుంచి కాపాడాలని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదేమైనా ఇలాంటి వాళ్ల విషయంలో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి.