కరోనా వ్యాధి తొలి కేసు నమోదవడంతో హైదరాబాద్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నా సమయంలో తాజాగా మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. నగరంలో పోలీసు కానిస్టేబుళ్లు స్వైన్ ఫ్లూ బారిన పడ్డారనే వార్త ఆందోళనకు గురి చేసింది. పాతబస్తీలోని పేట్లబురుజులో 9 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్లు అస్వస్థతకు గురయ్యారు. స్వైన్ ఫ్లూ అనుమానంతో వారిని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఒకరికి స్వైన్‌ ఫ్లూ సోకినట్లు తేలింది.

 

స్వైన్‌ ఫ్లూ బారినపడ్డ కానిస్టేబుల్‌ను ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 8 మందిని డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.

 

హైదరాబాద్‌లో స్వైన్‌ ఫ్లూ ఇప్పటికే కలకలం రేపుతోంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు నగరంలో 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క జనవరి నెలలోనే 43 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరందరూ గాంధీతో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. తాజాగా ఏఆర్ కానిస్టేబుల్ స్వైన్ ఫ్లూ బారిన పడటం కలకలం రేపుతోంది.

 

స్వైన్ ఫ్లూ.. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. స్వైన్ ఫ్లూ రోగులు దగ్గినా, తుమ్మినా వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకూ సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్లు పడిన చోట కూడా వైరస్ అంటుకొని ఉంటుంది. పొరపాటున దాన్ని ముట్టుకున్న చేతితో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకుంటే వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: