బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎదురుదాడిపై అధికార వైసీపీ ఘాటుగా స్పందించింది. వైసీపీ సీనియ‌ర్ నేత‌లు మోపిదేవి వెంకట రమణ, జయరాములు, ధ‌ర్మాన కృష్ణదాసు పేరుతో  సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నక్కబుద్ధిని, దొంగ వ్యవహారాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురాదలచుకున్నామ‌ని, . దీనికి సంబంధించి ఆధారాన్నికూడా మేం ప్రజలముందు పెడుతున్నామ‌ని సంయుక్తంగా తెలిపారు.


 
``స్థానిక ఎన్నికలు– రిజర్వేషన్లకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వం 2018, సెప్టెంబరు హైకోర్టులో అఫడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫడవిట్‌ ద్వారా బీసీ వర్గాలకు మేలు దక్కకుండా సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. ఆ అఫడవిట్‌లోని ముఖ్యాంశాలు చూస్తే...ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్, రూరల్‌డెవలప్‌ మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ మరియు అసిస్టెంట్‌ సెక్రటరీ చంద్రబాబు ప్రభుత్వం తరఫున ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులోని పాయింట్‌ నంబర్‌ 25 ప్రకారం.. 50శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో దాటరాదన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును ఈ పాయింట్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు, విభజన తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్‌ కు కూడా వర్తిస్తుందని చెప్పారు. `` అని వెల్ల‌డించారు. 

 

``టీడీపీ ప్రభుత్వం 2018 సెప్టెంబరులో దాఖలు చేసిన  26వ  పాయింటులో సుప్రీంకోర్టు 2016 ఫిబ్రవరి 8న ఇచ్చిన తీర్పులో ఏం చెప్పిందో రాశారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయినందున 60.55శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ప్రశ్నలకు ఇప్పుడు తాము సమాధానం చెప్పదలుచుకోలేదని, కాబట్టి పిటిషన్లు డిస్మిస్‌   చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. 27వ పాయింటులో మరింత వివరంగా చెప్తూ 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే రిజర్వేషన్లు 50శాతం మించడాన్ని అంటే, 60.55శాతం ఉండటాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది తప్ప భవిష్యత్తులో మరే ఎన్నికలకూ దీన్ని  వర్తింపచేసే అవకాశం లేదని 27వ పాయింటు చివరి వాక్యంలో చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇట్‌  కెనాట్‌ బీ ఎక్స్‌టెండెడ్‌ టు ఫ్యూచర్‌ ఎలక్షన్స్‌ అంటూ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. కాబట్టే..., స్పెషల్‌ఆఫీసర్లను నియమించుకోక తప్పడంలేదంటూ ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుని చేతులు ఎత్తేసింది. ఇప్పుడు నెపాన్ని తద్విరుద్ధంగా, తానిచ్చిన అఫిడవిట్‌కు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వంమీద నెడుతోంది. `` అంటూ వైసీపీ మంత్రులు స్ప‌ష్టం చేశారు. 

 

``యాభై శాతం రిజర్వేషన్లు మించడానికి హైకోర్టు, సుప్రీంకోర్టు అనుమతించడంలేదంటూ సాక్షాత్తూ మరోసారి హైకోర్టుకు తెలిపిన చంద్రబాబునాయుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని 59.75శాతం రిజర్వేషన్లు కావాలని దొంగ డిమాండ్లు చేయడం ఎంతవరకూ సహేతుకం. ఈ అఫిడవిట్‌ చంద్రబాబు దొంగ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తోంది. ఈ లేఖకు అనుబంధంగా అఫిడవిట్‌ను జతచేస్తున్నాం`` అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: