కరోనా వైరస్ కారణంగా ఘోరంగా నష్టపోయిన దేశం చైనా.. అయితే ఈ వైరస్ ను ఆలస్యంగా గుర్తించిన చైనా.. దాని ప్రభావం తెలిశాక మాత్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది. కరోనాపై ఏకంగా యుద్ధమే ప్రకటించింది. అందుకే ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచమంతటికీ విస్తరించినా చైనాలో మాత్రం దాని ప్రభావం తగ్గుతోంది. వేల మందికి కరోనా సోకినా.. విజయవంతంగా చికిత్స అందిస్తోంది.
మొదట్లో ప్రాణ నష్టం బాగా ఉన్నా.. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న హుబెయ్ ప్రావిన్స్లో 6కోట్ల జనాభా ఉన్నా.. వేల మందికి ఈ వైరస్ సోకినా చైనా గట్టి నియంత్రణ చర్యలు తీసుకుంది. కరోనా ప్రభావం తెలియగానే చైనా ప్రభుత్వం ఆవైరస్ బయటపడిన వుహాన్ నగరాన్ని అష్టదిగ్బంధం చేసింది. వేల మందికి వైరస్ సోకినట్లు గుర్తించిన ప్రభుత్వం వారిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స చేయాలి. అందుకోసం ఏకంగా 10, 15 రోజుల్లో 1,000, 1,500 పడకల ఆస్పత్రులను నిర్మించింది. ఆడిటోరియంలు, హోటళ్లు, ప్రదర్శనశాలు, ఖాళీగా ఉండే కార్యాలయాలను ఆస్పత్రులుగా మార్చేసింది.
అదే సమయంలో వైరస్ నిర్మూలనకు చికిత్స వేగవంతం చేశారు. మరణించిన వ్యాధిగ్రస్థులకు శవపరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలను బాగా అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చికిత్స చేయడం మొదలుపెట్టారు. మెరుగైన ఫలితాలు రావడడంతో పాటు కొద్దిరోజులకే చాలా మంది కోలుకున్నారు. కరోనా అంటు వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు ఇళ్లనుంచి బయటకు రాకుండా కట్టడి చేసింది. చాలా మంది నెల రోజుల వరకూ ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు.
వైరస్ వ్యాప్తితో మాస్కుల కొరత ఏర్పడడంతో వాటిని యుద్ధ ప్రాతిపదికన తయారు చేయించింది. ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవడంతో చైనా కరోనా వ్యాప్తిని అడ్డుకుంది.. ఇప్పుడు ఇండియాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరి మన ఇండియన్లు ఎలా ఈ కరోనాను ఎదుర్కొంటారో చూడాలి. ప్రభుత్వాలకు ప్రజలూ సహకరించాలి.