గత ఏడాది జరిగిన మహారాష్ట్ర రాజకీయం గుర్తుండే ఉంటుంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకున్నప్పటికీ... చివరి నిమిషంలో ఎన్సీపీని చీల్చి తమ ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే, ఆ సర్కారు కొనసాగలేదనుకోండి. అయితే, సేమ్ ఫార్ములాను మరో రాష్ట్రంలో అమల్లో పెట్టేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 35 కోట్ల వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల దిగ్విజయ్ ఆరోపించిన విషయం సంచలనం సృష్టించింది. తాజాగా దానికి సంబంధించిన పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్వల్ప మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఎస్పీకి చెందిన ఓ ఎమ్మెల్యేను.. బీజేపీ నేతలు హర్యానా తీసుకువెళ్లినట్లు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత అన్నారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను .. బీజేపీ లాక్కెళ్లినట్లు, బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నేతలకు ముడుపులు ఇస్తున్నారని కూడా దిగ్విజయ్ ఆరోపించారు.
హర్యానాలోని ఓ హోటల్లో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు, మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. బీజేపీ దాచిపెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దిగ్విజయ్తో పాటు ఆయన కుమారుడు, మంత్రి జైవర్ధన్ సింగ్.. హర్యానా హోటల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. అయితే ఆ ఎమ్మెల్యేల తమ ఆధీనంలోనే ఉన్నట్లు సీఎం కమల్నాథ్ అన్నారు. వారు మళ్లీ వెనక్కి వస్తారని ఆయన అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను.. బీజేపీ కొట్టిపారేసింది. రాజ్యసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో.. దిగ్విజయ్ ఈ డ్రామా ఆడుతున్నట్లు బీజేపీ ఆరోపించింది.