కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ ఎలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మన దేశంలో తొలిసారిగా కేరళ రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకింది .విదేశాల నుంచి వచ్చిన ఆ వ్యక్తికి కరోనా వైరస్ రాగా దానిని మన వైద్యులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు మన దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 21 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్య అధికారులు గుర్తించారు. చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా ఎమర్జెన్సీ విధించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్కు చెందిన ఒక యువకుడు బెంగుళూరు లోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు . ఈ 24 ఏళ్ల బాధిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల తన సంస్థ పని నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి తోటి ఉద్యోగులతో కలిసి హాంకాంగ్ వెళ్లాడు.
హాంకాంగ్లో కొన్ని రోజులు ఉండి తిరిగి వచ్చాడు. హాకాంగ్ నుంచి బెంగళూరుకు వచ్చిన అతడికి కరోనా సోకినట్టు వార్తలు రావడంతో బెంగళూరు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యాధికారులను అతడి ఫ్లాట్కు పంపి శుభ్రం చేయించి సీలు వేయించింది. అంతకుముందు బెంగళూరు కార్పొరేషన్ అధికారులు అతడి ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు. మరోవైపు అతడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వారితో పాటు అతడితో కలసి పనిచేసిన వారు నగరంలోని రాజీవ్గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛెస్ట్ డిసీజెస్లోని ఐసోలేషన్ వార్డులో చేరారు.
ఇక కరోనా బాధిత వ్యక్తితో పాటు హాంకాంగ్ కు వెళ్లిన అతడి స్నేహితులు సైతం ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. వీరి నుంచి కూడా వైద్యులు రక్త నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షల కోసం పూణెకు పంపారు. ఈ పరీక్షల నమూనాలు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, బాధితుడి ఫ్లాట్లో అతడితో కలిసి ఉన్న మరో యువకుడికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడు కలిసినట్టు భావిస్తున్న మొత్తం 71 మందిని గుర్తించిన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించారు.