తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొద్దిరోజులుగా అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఆయన టిఆర్ఎస్ చేరాల్సి ఉన్నా కాంగ్రెస్ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. అప్పట్లో ఆయనకు టిఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామని ప్రతిపాదనలు పెట్టినా ఆయన మాత్రం వెనకడుగు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అయోమయంగా ఉండడం, భవిష్యత్తులోనూ పుంజుకునే అవకాశం లేదన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య రోజురోజుకు పెరిగిపోతున్న గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు ఇవన్నీ బేరీజు వేసుకున్న ఆయన కాంగ్రెస్ వీడాలని అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే అతి తొందర్లోనే ఆయన టిఆర్ఎస్ గూటికి వెళ్లాలని చూస్తున్నారు. మార్చి 7వ తేదీన ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ జిల్లాలో విజయం సాధించిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే. నియోజకవర్గ అభివృద్ధి, తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి లతో పాటు శ్రీధర్ బాబు కూడా చేరాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఆయన చేరిక వాయిదా పడింది.
మొదటి నుంచి తన కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ వస్తుండడంతో ఆ పార్టీని వీడేందుకు శ్రీధర్ బాబు వెనక ముందు ఆలోచించాల్సి వచ్చింది. ప్రస్తుతం నియోజకవర్గంలో తన మాట అధికారులు ఎవరూ వినకపోవడం, తమ పార్టీ నాయకులు కూడా చెల్లాచెదురుకావడంతో ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్లాలని బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. మార్చి 7వ తేదీన కెసిఆర్, కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో మరింత గందరగోళం ఏర్పడే అవకాశం లేకపోలేదు. మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా శ్రీధర్ బాబు ని అనుసరించే అవకాశం కనిపిస్తోంది.