కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్ప కూలిపోతున్నాయి. మన దేశంలో కూడా కుబేరుల ఆస్తి కర్పూరంలో కరిగిపోతోంది. ఇక ఉత్పత్తి రంగం పడిపోవడంతో రేట్లు ఆకాశంలో ఉంటున్నాయి. చైనాలో పలు నిర్మాణ రంగాలు ఆగిపోయాయి. ఉత్పత్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉత్పత్తి రంగంలో ఏకంగా 96 శాతం క్షీణత నమోదు అయ్యిందంటేనే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. ఇక తాజాగా ఇతర దేశాల నుంచి దిగుమతులు ఆగిపోవడంతో మన దేశంలో కూడా పలు వస్తువుల రేట్లకు రెక్కలు వచ్చేశాయి.
ఇక హైదరాబాద్లో కరోనా నేపథ్యంలో మాస్క్ల రేట్లకు రెక్కలు వచ్చేశాయి. సికింద్రాబాద్లోని మహేంద్ర హిల్స్లో నివాసముండే సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో నగర వ్యాప్తంగా కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో ఆ బాధితుడికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో జంట నగరాల్లో కూడా ప్రజలు భయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లోని పలు స్కూళ్లు బుధవారం సెలవు కూడా ప్రకటించాయి. ఇక సికింద్రాబాద్లోని పలు విద్యాసంస్థల్లో మాస్కులు ధరించి పిల్లలు తరగతులకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రోడ్ల మీదకు వచ్చే వారంతా మాస్క్లు ధరించి వస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రూపాయి నుంచి 20, 30 వరకు ఉండే మాస్క్ల రేట్లకు ఇప్పుడు రెక్కలు వచ్చేశాయి. కరోనా ప్రభావాన్ని క్యాష్ చేసేందుకు మాస్క్ల రేట్లు విపరీతంగా పెంచేశారు.
రెండు లేయర్లతో ఉన్న మాస్క్ హోల్సేల్ ధర రూ.1. 60 పైసలు కాగా, కొందరు మెడికల్ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్ 95 మాస్కును రూ.300 వరకు అమ్ముతూ ప్రజల్ని దోచేస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వద్ద మాస్కుల కొరత తీవ్రంగా ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు.