కరోనా ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లు అన్నీ కుప్ప కూలుతున్నాయి. ఇప్పటికే చైనా మార్కెట్ల గత నెల రోజులుగా బోసి పోయి ఉన్నాయి. ఉత్పత్తి రంగం ఆగిపోయింది. ప్రపంచ దేశాలకు కోట్లాది రూపాయల ఉత్పత్తులు ఎగుమతి చేసే చైనా ఉత్పత్తులు ఆగిపోవడంతో వాటిని ఎగుమతి చేయలేకపోతోంది. ఇక ఇప్పుడు ఆ దేశం నుంచి ప్రపంచంలో పలు దేశాలు దిగుమతి చేసుకునే వస్తువులు కూడా ఆగిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ పలు వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయాయి. అంతెందుకు మనదేశం పలు ఔషధ ఉత్పత్తులను చైనా నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటూ వస్తోంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో చైనా నుంచి దిగుమతులు ఆగిపోయాయి. దీనికి తోడు ఇక్కడ రేట్లు పెరిగిపోవడంతో సంపద అంతా ఒక్కసారిగా ఆవిరి అయిపోతోంది.
ఇక కరోనా ఎఫెక్ట్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. వరుసగా ఏడవ సెషన్లో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ లాభాలనుంచి వెంటనే నష్టాల్లోకి మళ్లిన సూచీలు ఒక్కసారిగా దిగజారిపోయాయి. ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులకు తోడు.... ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్ప కూలుస్తోన్న కరోనా కూడా తోడవ్వడంతో సెన్సెక్స్ 700 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 193 పాయింట్లు క్షీణించింది. బ్యాంకు నిఫ్టీ కూడా 770 పాయింట్లు పతనమైంది.
ఇక సూచికలు అన్నీ తగ్గుముఖం పట్టడంతో సెన్సెక్స్ 38 వేల స్థాయిని కోల్పోయింది. దీంతో ఇంట్రే డే హై నుంచి 1298 పాయింట్లు పతనం కావడం గమనార్హం. యస్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా స్టీల్, గెయిల్, హీరో మోటోకార్ప్ భారీగా నష్టపోగా, ఐషర్ మోటార్స్, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ ,టెక్ మహీంద్ర లాభపడుతున్నాయి. ఇక పైన నష్టాల భాట పట్టిన కంపెనీల్లో షేర్లు ఉన్న ఇన్వెస్టర్లు అందరూ భారీగా నష్టపోయారు. కొందరు భారీగా సంపద కోల్పోవడంతో వాళ్లు నేలమీదకు వచ్చేశారు.