తెలంగాణ  రాష్ట్రంలో ఒక వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ రావడం, మరో 88 మందిని ఆయన కలిసిన జాబితాలో ఉండ‌డంతో రాష్ట్రంలో ఒక్క సారిగా భయాందోళనలు కలిగాయి. బయటికి చెప్పక పోయినా ఊహించ‌ని క‌ల‌వ‌రం రేగింది. అయితే, వారికి క‌రోనా లేద‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వైద్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తాజాగా మీడియాకు ఓ లేఖ విడుద‌ల చేశారు. `ఉత్కంఠ‌ను రేకెత్తించిన రెండు కేసుల విష‌యంలో అనుమానం ఉండడంతో పరీక్ష కోసం పూణే పంపించాం. ఎటువంటి ఫలితం వస్తుందో అని ఉత్కంఠగా ఎదురుచూశాం. అలవాటు లేకపోయినా ఏం కాకూడదు అని దేవుణ్ణి ప్రార్ధించాం. చివరగా అనుమానిత ఇద్దరికీ కోవిడ్-19 నెగిటివ్ రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం`` అని ఈటెల పేర్కొన్నారు.

 

`` ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ అంతా బాధలో ఉంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సంతోషం. ఇక మీదట కూడా వైరస్ ఎవరికీ సోకకుండా ఉంటుంది అని భావిస్తున్నాం. ప్రతి రోజు అప్రమత్తంగా ఉన్నాం. ప్రభుత్వం జిమ్మెదారీ తనంతో పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను దాచుకొనే పరిస్థితి ఉండదు. మంత్రిగా మరో సారి చెప్తున్నా ఈ వైరస్ గాలి ద్వారా రాదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి ఉన్న అమ్మ నాన్నకి కూడా వైరస్ సోకలేదు అలాంటిది మహేంద్ర హిల్స్‌ లో ఉన్న మిగతా వారికీ ఎలా వస్తుంది ఒక్క సారి ఆలోచించండి.`` అని ప్ర‌శ్నించారు.

 

కొంద‌రు త‌మ ఇంటి కిటికీలు తీయకుండా ఉంటున్నారని తెలిసిందని మనం 21వ శ‌తాబ్ధంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం అని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్నించారు. ``సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే అమ్మాయికి వైరస్ ఉందని మొత్తం బిల్డింగ్ ఖాళీ చేశారు. ఆ అమ్మాయికి నెగెటివ్ వచ్చింది. దయచేసి అతిగా స్పందిచకండి. చదువుకున్న వారు భాద్యతయుతంగా వ్యవహరించండి. లేదంటే సమాజానికి నష్టం. `` అని కోరారు.

 

``ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు చేస్తాం. అనుమానం ఉంటె కాదు డాక్టర్స్ నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తాము. దేశవ్యాప్తంగా 12 లాబ్ లు మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ లో ఎక్కడా పరీక్షలు చెయ్యరు. గాంధీలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తాం. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సమీక్ష నిర్వహించాము. దేశంలో మొదటి సారిగా ఇటువంటి వైరస్ ఉన్న వారికి చికిత్స ఇచ్చే అవకాశం ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చాము. ఈ అవకాశం ను వ్యాపారకోణం లోచూడకండి. వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి  చికిత్స అందించేందుకు ఎంత ఛార్జ్ చేయాలి అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దీనికి ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా అంగీకరించారు. వారికి ధన్యవాదములు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఉచితంగా చికిత్స అందించేందుకు  ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. అంతకీ అవసరం అయితే కట్టి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వాడుకుంటాం. 80 వేల  రూములు అందుబాటులు ఉన్నాయి`` అని తెలిపారు.

 

వైద్య సేవ‌ల కోసం 200 మెరికల్లాంటి వైద్య సిబ్బందిని ఎపిక చేసి శిక్షణ అందిస్తున్నామ‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు. ``రేపటినుండి వారు విధులు మొదలు పెడతారు. సాహసంతో పనిచేసేవారిని మాత్రమే రావాలని చెప్పాము. గాంధీ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి కాబట్టే అక్కడ కరోనా ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేసాము. వైరస్ సోకినా వ్యక్తికి మల్టీపుల్ ఆర్గాన్ సమస్య వస్తే ఇలాంటి హాస్పిటల్స్ మాత్రమే చికిత్స అందిచగలవు. జూనియర్ డాక్టర్స్ చేస్తున్న ఆందోళన అర్ధరహితం. అన్నీ తెలిసిన డాక్టర్స్ ఇలా చేయడం సమంజసం కాదు.  మాస్క్ లు  ప్రతి ఒక్కరు వాడాల్సిన అవసరం లేదు. ప్రజల భయంతో వ్యాపారం చేస్తే సహించం. అధికధరలకు అమ్మే వారిపై శాఖాపరమైన  దాడులు చేయిస్తాం.  తెలంగాణ ప్రజలారా వట్టి వదంతులు నమ్మకండి. విశ్వాసం కలిపించే ప్రయత్నం మీడియా చేయండి.`` అని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: