కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. భారత్లోకీ ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా.. ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీని తీవ్రతకు ఇప్పటిదాకా 3వేల మందికిపైగా మరణించగా, 90వేలకు పైగానే బాధితులు ఉన్నారు. మన దేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఇప్పుడు అందరినీ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అప్రమత్తమైంది. ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడ్డ రోగులకు అందించే చికిత్సకు అనుగుణంగా పాలసీలను రూపొందించాలని బీమా సంస్థలను ఆదేశించింది.
కరోనా వైరస్ బారిన పడిన వారు తీసుకునే వైద్యానికీ బీమా ఉండాలని ఐఆర్డీఏఐ నిర్ణయించింది. ఇందులో భాగంగానే తగిన పాలసీలను సిద్ధం చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టం చేసింది. ‘కరోనా వైరస్ బాధితులకు అందించే చికిత్సకు తగిన విధం గా బీమా పాలసీలను తీసుకురావాలి. రోగులకు సత్వర వైద్యం అందేలా క్లయిములు త్వరగా పూర్తికావాలి’ అంటూ ఇన్సూరెన్స్ కంపెనీలనుద్దేశించి ఐఆర్డీఏఐ ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. ఇప్పటికే చాలా రకాల వ్యాధులకు బీమాలున్న నేపథ్యంలో కరోనా వైరస్ కేసులనూ బీమా పరిధిలోకి తేవాలని ఐఆర్డీఏఐ చర్యలు చేపట్టడం కొందరికి ఉపశమనమని అంటున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 వైరస్ మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైందని, ఇది ఎలా ఉత్పన్నమైంది, దేనిద్వారా సంక్రమించిందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ వైరస్ నివారణ కోసం ఇప్పటి వరకు ఖచ్చితమైన మందులు లేవు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్ కావడంతో నిమోనియాకు సంబంధించిన ట్రీట్మెంట్తో పాటు స్పెషల్ కేర్, ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనాకు ఇప్పటి వరకు మందు లేదు. వ్యాధి వచ్చిన 100 మందిలో 80 మందికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరో 20 మంది ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కేవలం ఇద్దరికి మాత్రమే ప్రాణాపాయం కలిగే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారికి వెంటనే చికిత్స చేసి, తీవ్రమవ్వకుండా ఇప్పటికే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.