మొన్నటి వరకు అల్లర్లలతో అట్టుడికి పోయిన ఢిల్లీలో ఇప్పుడు మరో కలకం రేగింది. పార్లమెంటు ఆవరణలోకి బుల్లెట్లతో ఓ వ్యక్తి ప్రవేశించడం సంచలనం సృష్టించింది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ అల్లర్లు జరిగిన సమయంలో ఇంటలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ అంకిత్ శర్మను దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే. దాదాపు 400 వందల కత్తిపోట్లతో అతని శరీరాన్ని ఛిద్రం చేశారని ఫోరెన్సిక్ రిపోర్టు లో పేర్కొన్నారు. అల్లరి మూకలు దాడులకు తెగబడేలా స్థానిక మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్ రెచ్చగొట్టారని ఆరోపణలు వచ్చాయి.
మొన్నటి వరకు తప్పించుకు తిరిగిన తాహిర్ హుస్సేన్ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ రోజ్ ఎవెన్యూ కోర్టులో లొంగిపోయేందుకు వెళుతున్న తాహిర్ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఢిల్లీలో మరో కలకలం చెలరేగింది. మూడు బుల్లెట్లతో అక్తర్ ఖాన్ అనే వ్యక్తి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించాయి. పోలీసు విచారణలో అక్తర్ ఖాన్ కు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉన్నట్టు తేలింది.
అయితే ఆయన్ని పూర్తిగా విచారించన తర్వాత ఏ పొరపాటు లేదని పోలీసులు విడదల చేశారు. తాజాగా ఈ విషయంపై అక్తర్ ఖాన్ మాట్లాడుతూ, తన జేబులో బుల్లెట్లు ఉన్నాయనే విషయాన్ని తాను గమనించలేకపోయానని, పొరపాటున బుల్లెట్లతో పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించానని పోలీసులకు చెప్పానని తెలిపారు. కాగా, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో జరిగిన ఈ ఘటనతో ప్రజాప్రతినిధులతో పాటు అంతా ఉలిక్కిపడ్డారు. గతంలో పార్లమెంట్ లో అగంతకుల కాలప్పులు జరిగిన విషయం తెలిసిందే.