టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరి మరోసారి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేదిగా ఉందా? ఆయన అనుసరిస్తున్న విధానంతో ఈ రాష్ట్రం మరోసారి ప్రమాదంలో పడబోతోందా? అంటే .. ఔన నే అంటున్నారు పరిశీలకులు. అధికారంలో ఉన్న సమయంలో విభజన హామీల మేరకు(రాజ్యసభ లో ప్రధాని ఇచ్చిన హామీ) రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడంలో ఆయన విఫలమయ్యారు. అసలు ప్రత్యేక హోదా ఎందుకని కూడాప్రశ్నించారు. ఆ తర్వాత మళ్లీ యూటర్న్తీసుకుని హోదా పోరు అంటు ధర్మ పోరాట దీక్షలు చేసి అప్పట్లో కోట్లకు కోట్ల నిధులు దుర్వినియోగం చేయడంపై కోర్టులు సైతం తప్పుపట్టాయి.
ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఇప్పుడైనా రాష్ట్రానికి ప్రయోజనకరమైన విధంగా ఆయన తన అనుభవాన్ని జోడించి ఏమైనా చేస్తున్నారా? అంటే ... మిలియన్ డాలర్ల ప్రశ్నగా నే మారుతోంది. ప్రస్తు తం స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్రంలో రంగం సిద్ధమైంది. హైకోర్డు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సమయంలో ఈ ఎన్నికలను అడ్డుకోవాలనే కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు. రిజర్వేషన్ల సాకును చూపుతూ సుప్రీం కోర్టుకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్న ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిని సృష్టిస్తున్నారు.
అయితే, దీనివల్ల నష్టమేంటనే ప్రశ్న వస్తుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. 14వ ఆర్థిక సంఘం నుంచి ఏపీకి 4 వేల కోట్లకు పైగా మొత్తం స్థానిక సంస్థలకు అందాల్సి ఉంది. వీటికి గడువు మార్చి 31. ఆ రోజు దాటిపోతే.. ఈ నిధులను కేంద్రం ఇవ్వదు. అయితే, ఆలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. వాస్తవానికి 2018 జూలైలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలి. కానీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సదరు నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించకపోతే(మార్చి 31లోగా) నిధులు రావు.
ఇది రాష్ట్రానికి మరింత భారంగా పరిణమిస్తుంది. అందుకే జగన్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ఎన్నికలకు కృషి చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అడ్డు పడడం ద్వారా ఈ నిధులకు గండి కొట్టిన వారవుతారనేది ప్రభుత్వం యోచన. ఈ నేపథ్యంలో ఆయన మరి అడ్డుకుంటే.. రాష్ట్రానికి మరోసారి ప్రతిపక్షంలో ఉండి కూడా అన్యాయం చేసిన వారవుతారనే వాదన బలంగా వినిపిస్తోంది.